మీరు వలసవాది కాదా? ఎక్కడ్నించి వాచ్చారో తెలీదా?: కేసీఆర్పై రేవంత్
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై టీడీపీ వర్కింట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొత్తికోయలు ఇక్కడి వాళ్లు కాదంటూ వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, కేసీఆర్ వలస వాది కాదా? ప్రశ్నించారు.
సెప్టెంబర్ 16న జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జనగలాంచ అటవీప్రాంతంలోని గొత్తికోయలుపై అటవీశాఖాధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సోమవారం గొత్తికోయలు గూడేన్ని టీడీపీ నేతలతో కలిసి రేవంత్రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయలుపై అమానుషంగా దాడులు చేస్తున్నారన్నారు. అటవీశాఖ అధికారుల దాడుల తీరుపై గూడెం వాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ పూర్వీకులు బీహార్ రాష్ట్రం నుంచి విజయనగరం వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చినవారేనని రేవంత్ అన్నారు. ఆయన కొడుకు కూడా గుంటూరులో చదువుకొని అమెరికాకు వెళ్లాడని చెప్పారు.
అడవిని నమ్ముకుని వనంలో బతికే గిరిజనులను వెళ్లగొట్టే హక్కులేదన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో గొత్తికోయలు విషయాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రి చందూలాల్, స్పీకర్ మధుసూదనాచారి ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.