ఎవరికీ తెలియకుండానా? ఉత్తమ్కు నోటీసులు ఇవ్వాల్సిందే: రేవంత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. హూజుర్నగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా పద్మావతి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.
ఈ విషయమై బుధవారం గోల్కొండ హోటల్లో కుంతియాతో రేవంత్ భేటీ అయ్యారు. అధిష్టానానికి సమాచారం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రేవంత్ ఈ సందర్బంగా నిలదీశారు.
అంతేగాక, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని అన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హూజుర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో హూజుర్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచే సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కూడా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.