హామీల పట్ల నేతలను అంగీ పట్టి నిలదీయండి..! పట్నం గోస కార్యక్రమంలో ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్..!!
హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాస్త విరామం దొరికిన వెంటనే మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టారు. తెలంగాణ లో ప్రజా సమస్యలపై పోరాండే్ందుకు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చారో తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటిస్తున్నారు. పట్టణాల్లో మురికి వాడలు లేని నగరాన్ని నిర్మిస్తామని అధికార పార్టీ చేసిన వాగ్దానం ఎంతవరకు అమలైందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగప్రవేశం చేసారు. మల్కాజిగిరి నియోజక వర్గంలోని పలు మురికి వాడల్లో పర్యటిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చిందో తెలుసుకుంటునే "పట్నం గోస" కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి.
Recommended Video
పట్టణ ప్రగతి కాదు.. ప్రజల గోస చూడాలంటున్న మాల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి...
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి ధీటుగా పట్నం గోస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గంలోని పలు మురికి వాడల్లో పేద ప్రజల జీవన పరిస్దితులు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునే కార్యక్రమానికి నాంది పలికారు. తెలంగాణ ప్రభుత్వం మురికి వాడల స్దితిగతులను సమూలంగా మార్చి వేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా ఎంతవరకు నెరవేర్చిందో ప్రత్యంక్షంగా తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
పట్నం గోస కార్యక్రమంతో ప్రజలతో రేవంత్.. గులాబీ పార్టీ మాట తప్పిందని ఆరోపణ..
ముఖ్యంగా నిరుపేదల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన అధికార పార్టీ మొట్టమొదట వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పలు సందర్బాల్లో హామీ ఇచ్చింది. కాగా మొదటి ఐదు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేదలకు అనుకున్న స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి మురికి వాడల్లోని ప్రజలకు ఏమేరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా ఇంటిటికి నల్లా, వృద్యాప్య పింఛన్, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లు తదితర పథకాల అమలు గురించి స్వయంగా ప్రజలనడిగి తెలుసుకుంటున్నారు ఎంపి.
మురికి వాడల తీరు మారలేదు.. ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలేనన్న రేవంత్ రెడ్డి..
ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో వాస్తవాలను బహిర్గతం చేసే అవకాశాలు ఉండవని, అందుకు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమం నిర్వహిస్తున్నారని రేవంత్ వర్గం చెప్పుకొస్తోంది. పట్నం గోస కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మొదట అల్వాల్ ప్రాతంలోని దళిత వాడల్లో పర్యటించారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుద్యం, డబుల్ బెడ్ రూంలు, పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలలు, తదితర సదుపాయాల గురించి ప్రజలనడిగి తెలుసుకున్నారు. చాలా వరకు పేద ప్రజలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాల్లో పెద్దగా మార్పులేవీ చోటుచేసుకోలేదన్న అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టండి.. డబుల్ బెడ్ రూంల పై ప్రభుత్వాన్ని నిలదీయాలన్ని ఎంపీ..
రెండో రోజు ఎల్బీ నగర్ మురికి వాడల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న పరిస్తుతులను చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసారు. అధికార పార్టీ నాయకులు మురికి వాడల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. మురికి వాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి, ప్రభుత్వం మెడలు వంచేందుకే తాను పట్నం గోస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని ప్రజలో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. పేద ప్రజల మౌళిక సదుపాయాల కోసం, సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అసత్య ప్రచారంగా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ పేదల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.