కేసీఆర్.. చివరకు నీకు మిగిలేది ఆ కొందరే..! పేకమేడలా కూలిపోవడం ఖాయమన్న రేవంత్
కొడంగల్ : టీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ పేకమేడలా కూలిపోవడం ఖాయమన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన అందించలేదని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక కొడంగల్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధినేతపై మాటల తూటాలు పేల్చారు. ప్రతిపక్షాలను పట్టించుకోకపోవడమే గాకుండా కనీసం సూచనలు, సలహాలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మంత్రులను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం, వారిని నమ్మకపోవడం కేసీఆర్ నియంత పాలనకు అద్దం పట్టిందని విమర్శించారు.
నాలుగున్నరేళ్ల పాలన అంతా కూడా మోసాల పునాదుల మీదే జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చిత్రవిచిత్రాలు చూడబోతున్నారని జోస్యం చెప్పారు. చివరికి ఆయనకు మిగిలేది కిరాయి నేతలు, కొందరు కాంట్రాక్టర్లు, కొందరు పార్టీ ఫిరాయింపుదారులేనంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి ఆయనకు తీరని నష్టంగా అభివర్ణించారు. నమ్మించి మాట తప్పే కేసీఆర్ నైజం ప్రజలు గుర్తించారని.. అది సహించకపోవడంతోనే ఎన్నికల్లో టీఆర్ఎస్ సీన్ రివర్స్ అవుతుందన్నారు.