మండుటెండలో కాళ్లకు బొబ్బలు: టీఆర్ఎస్ నేతలను పందులతో పోల్చిన రేవంత్
హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలేరు ఉపఎన్నికలో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ నడుస్తోందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ తరుపున తాను, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, నామా నాగేశ్వరరావు, సుచరిత రెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నామన్నారు.
కాగా, పాకిస్థాన్ తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, జూపల్లి, హరీశ్రావు, ఎర్రబెల్లి ఇలా కసాయోళ్లంతా చేరారారని ధ్వజమెత్తారు. పందులు గుంపులుగా వస్తే, సింహం సింగిల్గా వస్తుందని, టీఆర్ఎస్ వాళ్లను పందులతో పోలిస్తే... పందులు కూడా బాధపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కసాయి అని, కన్నతల్లి లాంటి సుచరితను మండుటెండలో కాళ్లకు బొబ్బలు వచ్చే విధంగా పల్లెపల్లెకు తిప్పే పరిస్థితికి కారణమయ్యారని దుయ్యబట్టారు. ఆమె భర్త రాంరెడ్డి వెంకటరెడ్డి గుండెపోటుతో చనిపోతే రాజకీయాల్లో విలువలను పెంపొందించి పదిమందికి ఆదర్శంగా ఉండాలని, సుచరితను ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నం చేశామన్నారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కసాయిగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పాలేరులో కసాయోళ్లు అందరూ గుమిగూడారని, వాళ్లందరూ కలిసి ఒంటరి ఆడబిడ్డపై యుద్ధం ప్రకటించినట్టుగా పది మంది మంత్రులు, పాతిక మంది ఎమ్మెల్యేలు, పదివేల మంది కార్యకర్తలను మోహరించారని రేవంత్ వ్యాఖ్యానించారు.
సుచరితను రాజకీయంగా ఓడించాలని చూస్తుంటే, ఉండలేక, కడుపుమండి ఎర్రని ఎండలో నిలబడి ఆమెకు మద్దతుగా ప్రచారానికి వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లాలో దుష్ట చతుష్టయం జమయిందన్నారు. ఒక పక్కన పువ్వాడ అజయ్, రెండో పక్కన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మూడో ఆయన జలగం, నాలుగో ఆయన తుమ్మల అంతా ఒక్క దగ్గర జమ అయ్యారన్నారు.
గతంలో ఏనాడైనా తుమ్మల, జలగం కలిశారా..? ఏనాడైనా పొంగులేటి, పువ్వాడ కలిశారా?' అని ప్రశ్నించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి గురువారం రోడ్ షో నిర్వహించారు.