అరగంటకే హైదరాబాద్ అద్వానంగా: 'ఇక విశ్వనగరంగా ఎలా చేస్తారు?'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ముందు హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని ఇంటింటికి తిరిగి చెప్పిన కేటీఆర్ ఇప్పుడెక్కడున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
నగరంలో అరగంట సేపు కురిసిన గాలివానకే పరిస్థితి చిన్నాభిన్నమైందని చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన నగరాన్ని ఇప్పటి వరకు గాడిలో పెట్టే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని రేవంత్ విమర్శించారు.
ఈ పరిస్థితినే చక్కదిద్దలేకపోతోన్న కేటీఆర్ హైదరాబాద్ని విశ్వనగరంగా ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో పరిస్థితి ఘోరంగా ఉంటే మున్సిపల్ శాఖ మంత్రి విదేశాలకు వెళ్లారని రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ను ఏనాడో టీడీపీ ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చేసిందన్నారు.
అక్రమ హోర్డింగ్లను వెంటనే తొలగించాలి
నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్లను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు, హోర్డింగ్ ఏజెన్సీల నిర్వాహకులకు మంత్రి తలసాని శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం సంభవించిన గాలి, వాన బీభత్సంపై మంత్రి తలసాని శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించని యూనిక్ హోర్డింగ్లను వెంటనే తొలగించాలన్నారు. శుక్రవారం నగరంలో 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వర్షం కుసిందని, సకాలంలో రెస్క్యూ బృందాలను రంగంలోకి దించామన్నారు.
ప్రజలు కూడా అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రానున్నకాలంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రి తెలిపారు. విపత్తుల నివారణకు సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
ఈ సమావేశానికి హాజరైన మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత హోర్డింగులు 50-60 కి.మీ వేగాన్ని మించి గాలులను తట్టుకోలేవని, హోర్డింగ్ల విషయంలో జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఎమర్జెన్సీ కంట్రోల్ రూం ఏర్పాటు
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ వివిధ విభాగాలతో ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిన్న ప్రజల నుంచి 420 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదుల పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, కలెక్టర్ రాహుల్బొజ్జా, కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు హాజరయ్యారు.