ఆట మొదలైంది: కెసిఆర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చిచ్చు
మెదక్: తెలంగాణలోని మెదక్ జిల్లా గజ్వెల్ - తూప్రాన్లో ఫ్లెక్సీ చిచ్చు రాజుకుంది. తూప్రాన్ మహంకాళీ జాతర సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీనిని టిఆర్ఎస్ తొలగించడంతో వివాదం అయింది.
తూప్రాన్లో టిడిపితో పాటు టిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. టిడిపి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, గజ్వెల్ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ పైన పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డిలు ఉన్న ఫ్లెక్సీని టిడిపి ఏర్పాటు చేసింది.
అందులో ఆట మొదలైంది అని రాశారు. దీనిని టిఆర్ఎస్ నాయకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. దీంతో, ఇది ఇరువర్గాల మధ్య వాదనకు దారి తీసింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం టిడిపి శ్రేణులచే ఆ పోస్టర్ను తీసేయించారు.
కొద్ది రోజుల క్రితం టిడిపి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలయిన సందర్భంలో అలాంటి ఫ్లెక్సీలే హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. ఆయనను కుట్రపూరితంగా టిఆర్ఎస్ ఇరికించిందని టిడిపి మండిపడుతోంది.
షర్మిల పరామర్శ యాత్ర
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల సోమవారం నాడు తెలంగాణలో మలి విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆమె పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతిని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరార్శించనున్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి ఆమె బయలుదేరుతారు. నేరుగా వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం చేరుకుంటారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు.