జగన్ సర్కారు నిర్ణయం తెలంగాణలోనూ అమలు కావాలి కాదా?: కేసీఆర్ గుండెలు అదరాలంటూ రేవంత్
హైదరాబాద్: సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు నెల రోజులకుపైగా సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు.
అన్నీ కోర్టులే చేస్తే.. కేసీఆర్ గాడిద పళ్లు తోముతున్నారా?: సమరభేరి సభలో రేవంత్ రెడ్డి ఫైర్
సమైక్య పాలనలో కూడా లేని నిర్బంధం...
సమైక్య పాలనలో కూడా లేని నిర్బంధం ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని మండిపడ్డారు. సీమాంధ్రులు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసనలకు అనుమతిచ్చారని.. ఇప్పుడు కేసీఆర్ మాత్రం అనుమతులివ్వకుండా నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సభకు కూడా కేసీఆర్ అనుమతులు ఇవ్వలేదంటే ఏంటని ప్రశ్నించారు.
ఆర్టీసీపై 27.50శాతం వ్యాట్.. జీఎమ్మార్ కోసం 1శాతం వ్యాట్
ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల్లో లేదని.. నెట్టివేయబడిందన్నారు రేవంత్ రెడ్డి. సమైక్య రాష్ట్రంలో డీజిల్ మీద 22.50శాతం వ్యాట్ ఉంటే.. కేసీఆర్ పాలనలో అది 27.50శాతం చేశారని అన్నారు. దీంతో ఆర్టీసీకి రూ. 600 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఇక జీఎమ్మార్తో కలిసి ధనవంతులు ఎక్కే విమానాల్లో ఉపయోగించే పెట్రోల్పై 34శాతం ఉండాల్సిన పన్నును 1శాతానికి తగ్గించారని ఆరోపించారు. ఆర్టీసీ కొనుగోలు చేసే విడిభాగాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేస్తోందన్నారు.
ఆర్టీసీ వేల కోట్ల ఆస్తులు..
విద్యార్థులకు, వికలాంగులకు ఇచ్చే పాస్ల బిల్లులను కూడా ఆర్టీసీకి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీకి వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని.. అవన్నింటినీ కేసీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు ఉపయోగించుకుంటున్నారని.. దీంతో ఆర్టీసీకి అద్దె రూపంలో రావాల్సిన లాభాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం విధించే పన్నులన్నీ ఆర్టీసీని దివాలా వైపు నడిపిస్తున్నాయని అన్నారు.
ఏపీ నిర్ణయంతో తెలంగాణలో అమలు కావాలి కాదా..
కోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదని చెప్పిన కేసీఆర్.. విభజన జరగనప్పుడు ఏపీలో తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కూడా అమలవుతుంది కాదా అని అన్నారు. ఇప్పుడు సంస్థ ఒక్కటే కాదా అన్నారు. ఆస్తులు, అప్పులు పంచుకోనంత కాలం ఒక్కటే సంస్థ అని అన్నారు. ఏపీలో సర్కారు నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్లో పడుకున్నోళ్ల గుండెలు అదరాలి..
ఆర్టీసీ కార్మికులెవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీ పోరాటానికి తాము అండగా ఉంటామని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తాము 21న ప్రగతిభవన్ ముట్టడించామని అన్నారు. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టినా.. ఆరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ గడీని ముట్టడించామన్నారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించే ముందే కార్మికుల ఐక్యతా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో సభకు హాజరైన నేతలు, కార్మికులు, ప్రజలు కూడా నినదించారు. ప్రగతి భవన్లో పడుకున్నోళ్ల గుండెలు అదిరేలా నినాదాలు చేయాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ అన్నారు.