ఎర్రబెల్లిని కెసిఆర్ పోమన్నారు, ఇక వాచ్మెన్ ఉద్యోగమే: రేవంత్ రెడ్డి
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఎర్రబెల్లి దయాకర రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిన్న నామినేషన్లకు తుది గడువు కావడంతో తెలంగాణ టిడిపి అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించిందన్న వార్తలు వచ్చాయి.
దీంతో తమ పార్టీ అభ్యర్థులను టిడిపి హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించింది. ఈ సందర్భంగా అభ్యర్థులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రలోభాలకు లోను కామని, పార్టీ మారబోమని వారితో ఆయన ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ మారిన ఎర్రబెల్లికి తెరాసలో దక్కేది వాచ్మన్ పోస్ట్ మాత్రమే అన్నారు. అన్నారు. ఎర్రబెల్లి తెరాసలో చేరాక కేసీఆర్ పక్కన నిలబడబోగా, పోయి కూచో పో అని కేసీఆర్ అన్నారట, ఇప్పుడు ఆయనకు మిగిలింది కెసిఆర్ ఫాంహౌజ్లో వాచ్మన్ ఉద్యోగమే అన్నారు.
వరంగల్లో టిడిపి తరపున పోటీ చేయడానికే ఎవరూ లేరని తెరాస నేతలు విమర్శిస్తున్నారని కానీ పెద్దసంఖ్యలో అభ్యర్ధులు ముందుకొచ్చారన్నారు.
వరంగల్ అభివృద్ధికి ఎన్నో చేస్తామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్ అక్కడి బస్తీల్లో తిరిగి చెప్పారని, కానీ ఒక్కటి కూడా చేయలేదని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను సిఎం కెసిఆర్ నెరవేర్చలేదన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 58 డివిజన్లకు గాను 53 మందికి టిడిపి బీఫారాలు ఇచ్చింది. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులకు టిడిపి మద్దతిస్తుంది.