నిన్న 'ఎన్టీఆర్' వివాదంలోకి కెసిఆర్ను, నేడు వైసిపిపై రేవంత్ ఆశ్చర్యకర వ్యాఖ్య
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డి తరఫున రేవంత్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తల్లిలాంటి పార్టీని వీడారని విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి తల్లిలాంటి పార్టీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమ్ముకున్నారన్నారు.
వైసిపికి ద్రోహం చేశారన్నారు. రేవంత్ వ్యాఖ్యల పైన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెరాసతో రహస్య ఒప్పందం చేసుకొని జగనే పంపించారని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు వైసిపిని మోసం చేశారని చెప్పడం మరోసారి టిడిపి రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనం అంటున్నారు.
ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావును పదవి నుంచి దించి చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కుట్ర చేసింది, ఆ తర్వాత లబ్ధి పొందింది కేసీఆరేనని ఆరోపించారు.
ఇరవై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ను అలా దించేయడం వల్ల అప్పటి వరకు మంత్రి కానీ నీ తండ్రికి మంత్రి పదవి వచ్చిందని, అది నిజమో కాదో మీ నాన్నను అడుగు అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాకిచ్చారు. ఎన్టీఆర్ను దించేయడంలో కేసీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు.