చంద్రబాబు-రాహుల్ భేటీపై రేవంత్ రెడ్డి స్పందన, మేం గతంలో మిత్రులం: జానారెడ్డి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ పార్టీ నాయకులను ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం కలిశారు. ఆయనను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిశారు. సీనియర్ నేత జానారెడ్డి, గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వంటి నేతలు ఏపీ సీఎంను కలిశారు.
Recommended Video
మోడీ వార్నింగ్ ఇచ్చారు, అందుకే రేపు రాహుల్ గాంధీని కలుస్తున్నా: చంద్రబాబు ఊహించని ప్రకటన!
అనంతరం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. కూటములను నడిపిన అనుభవాలు రెండు పార్టీలకు ఉందని చెప్పారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ లేదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు.
ఇద్దరు కీలక నేతలు కలిశారు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పని చేస్తే దేశ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. గతం గత అన్నారని, నేడు, భవిష్యత్తు.. ఈ రెండు అంశాల పైనే చర్చ అని చంద్రబాబు, రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. దేశానికి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల కోసం ఇద్దరు కీలకమైన నాయకులు కలిశారన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పని చేసిన పార్టీలు, నాయకులు కలిశారని, ఇది దేశానికి శుభసూచకమన్నారు.
చంద్రబాబు, రాహుల్ కలవడం అత్యవసరం
ఇది దేశానికి అత్యవసరమని రేవంత్ చెప్పారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో చంద్రబాబు.. రాహుల్ గాంధీని కలిశారని, వారు ప్రజల కోసం పని చేసేందుకు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, దేశంలో మోడీ ప్రమాదకరంగా తయారయ్యారని చెప్పారు. ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూలుస్తూ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అందరి మీద దాడులు చేస్తున్నారని, విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఒకప్పుడు మిత్రులం.. చంద్రబాబుతో జానారెడ్డి భేటీ
చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా భేటీ అయ్యారు. పొత్తులు, చంద్రబాబుతో భేటీ అంశంపై ఆయన మాట్లాడారు. పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో పూర్తి కావొచ్చునని చెప్పారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. ఒకప్పుడు చంద్రబాబు, నేను మిత్రులం అని చెప్పారు.
మా కూటమి గెలుపు తథ్యం
వచ్చే ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికే కూటమి ఉందని, దానిని బలీయం చేస్తున్నామని, అందుకే పలువురు నేతలు కలుస్తున్నారని, ఇది స్వాగతించవలసిన విషయమని చెప్పారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తారా అని అడగ్గా.. దాని గురించి తాను అడగలేదని, తెలియదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరి పేర్లు ఒకేసారి ప్రకటిస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్న సమయంలో, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న సమయంలో అభివృద్ధిని కాంక్షించి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం అనేకసార్లు ఇలాంటి కూటములు ఏర్పడ్డాయని చెప్పారు.