తలుపులు పగులగొట్టి ఇంట్లోకెళ్లిన అధికారులు! ఐటీ దాడులపై రేవంత్, కవిత ఏమన్నారంటే?
హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చారు. అనంతరం గురువారం ఉదయమే ప్రచారానికి వెళ్లిపోయారు.
Recommended Video
హైదరాబాద్ రండి.. ప్రచారంలో ఉన్నా: ఐటీ అధికారులకు రేవంత్, ముఖంలో లేని టెన్షన్
ఏమేం గుర్తించారో తెలియాలి
ఐటీ అధికారులు వచ్చినప్పుడు రేవంత్ ఇంట్లో లేరు. హైదరాబాద్ జుబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసం ప్రస్తుతం ఐటీ అధికారుల ఆదీనంలో ఉంది. ఉదయం రేవంత్ ఇంటికి వచ్చిన అధికారులు తలుపులు తీయాలని పనిమనుషులను అడిగారు. సర్, ఇంట్లో లేరు, ఆయనకు ఫోన్ చేయండి అని పనిమనుషులు చెప్పడంతో.. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యుల ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కాగా, ఉదయం నుంచి సోదాలు చేశారు. ఏమేం గుర్తించారో తెలియాల్సి ఉంది.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
తమ నివాసాలపై సోదాల విషయంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఐటీ అధికారులం అంటూ తనకు కొందరు ఫోన్ చేశారని, ఎన్నికల ప్రచారంలో ఉన్నానని చెప్పడంతో వారు ఫోన్ పెట్టేశారని చెప్పారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ వస్తున్నట్లు తాను చెప్పానని అన్నారు. కొడంగల్లోని తన నివాసంలో సోదాలు జరగడం లేదన్నారు. హైదరాబాదులోని తన బంధువుల ఇళ్లలోను సోదాలు చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు.
ఎదుర్కోలేక దాడులు
ప్రతిపక్షాలను ఎదుర్కోలేకే ఐటీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ వారెంట్ కూడా బీజేపీ, తెరాస కుట్రే అన్నారు. ఐటీ దాడులు, అరెస్ట్ వారెంట్లతో తమలోని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. రేవంత్ ఇంటిపై ఐటీ దాడులకు తెరాసకు, కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి దానిని కేసీఆర్కు ఆపాదించడం సరికాదన్నారు.
వారికి అండగా ఉంటాం
ప్రశ్నించే వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గురువారం అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జానా స్పందించారు. ప్రభుత్వ కక్ష సాధింపునకు గురయ్యే పార్టీ నేతలకు తాము అండగా ఉంటామని చెప్పారు.