అంతొద్దు: రేవంత్ రెడ్డి, కెసిఆర్తో టిడిపి ఎమ్మెల్యే మాగంటి సీక్రెట్ భేటీ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర పర్యటన పైన గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లు నిర్మించుకోవచ్చునని మహారాష్ట్ర గతంలోనే చెప్పిందన్నారు.
ఇప్పుడు కూడా 148 మీటర్లకే మహారాష్ట్ర అంగీకరించిందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కెసిఆర్ సాధించికు వచ్చింది ఏమీ లేదన్నారు. గోదావరి జలాలను హైదరాబాద్ తరలించాలనేది గతంలో టిడిపి నిర్ణయమే అన్నారు.
మాగంటి.. కెసిఆర్తో సీక్రెట్గా భేటీ అయ్యారా?
టిడిపి దివంగత నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన మాధవరెడ్డి వర్ధంతి సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, గ్రేటర్ టిడిపి అధ్యక్షులు మాగంటి గోపినాథ్ నిన్న హైదరాబాదులోనే ఉన్నారు. పైగా అధినేత జగన్ ఆహ్వానించారు.
అయినప్పటికీ మాధవరెడ్డి వర్ధంతికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని మాగంటి.. సోమవారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా కేసీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మాగంటి కేసీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది.
ఈ విషయం సోమవారం బయటకు రాలేదు. కానీ మంగళవారం దీనిపై వార్తలు వస్తున్నాయి. మాగంటి గోపినాథ్ను కలిసిన తర్వాతే కేసీఆర్ ముంబై వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ నేపథ్యంలో మాగంటి కూడా టిడిపికి చేయిచ్చి కారు ఎక్కడం ఖాయమంటున్నారు.