ఓ వైపు సంతోషం.. మరోవైపు బాధ: ఏపీ కుప్పకూలుతోందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఏపీ రాజధాని రగడ..
గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడే అసెంబ్లీ, సచివాలయాలు నిర్మించి.. అక్కడ్నుంచే పాలన కొనసాగించింది. అయితే, ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మూడు రాజధానులంటూ ప్రకటన చేసింది. అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధానిగా చేస్తామని చెప్పింది. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు గత 26 రోజులుగా భారీ నిరసనలు కొనసాగిస్తున్నారు.
సంతోషం.. బాధ అంటూ.. రేవంత్
ఈ నేపథ్యంలో ఏపీ తాజా పరిణామాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలే పరిస్థితిలో ఉందన్నారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నా.. ఒక భారతీయుడిగా బాధగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్లో స్థిరాస్థి వ్యాపారం పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో కుప్పకూలే పరిస్థితి వల్ల తెలంగాణకే ప్రయోజనం అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో స్థిరాస్థి వ్యాపారి కోసమే..
నిన్నటి వరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందన్నారు. తెలంగాణలో ఓ స్థిరాస్థి వ్యాపారికి మేలు చేసేందుకే గందరగోళం సృష్టించారని ఏపీ సర్కారుపై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. అయినా అది పక్క రాష్ట్ర సమస్య అని.. తెలంగాణలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయన్న రేవంత్.. తన ప్రాధాన్యత ఈ రాష్ట్రమేనని.. పక్క రాష్ట్రం కాదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు
ఇది ఇలావుంటే, తెలంగాణ సర్కారుపై రేవంత్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేటీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. పట్టణాల్లో రెండు పడక గదుల ఇళ్లు, ఇంటింటికీ తాగునీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లను చేస్తానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని.. ఇప్పుడు ఆ నీటిని కేసీఆర్ గానీ.. కేటీఆర్ గానీ తాగుతారా? అని సవాల్ విసిరారు. ఒక బాటిల్ ఆ నీళ్లు తాగితే.. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని అన్నారు.