ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు: కేసీఆర్కు రేవంత్ సవాల్ ‘మా మామ కోటీశ్వరుడు’
హైదరాబాద్: తన నివాసాల్లో ఐటీ దాడులు జరిగిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని రేవంత్ ఆరోపించారు. మార్కెట్ విలువ పెరగడంతోనే తన ఆస్తుల విలువ పెరిగిందని అన్నారు.
అభద్రతా భావంలో కేసీఆర్..
కేసీఆర్ అభద్రతాభావానికి గురవుతున్నారని, ప్రగతిభవన్లో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
బినామీ పేర్లతో వ్యాపారాలు చేయలేదు
జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటిని తన కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని రేవంత్ తెలిపారు. 2014లో బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నిర్మాణానికి రుణాలు తీసుకున్నారని వెల్లడించారు. బినామీ పేర్లతో వ్యాపారాలు చేసినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మలేసియా, సింగపూర్లో వ్యాపారాలు చేసినట్లు పేర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఆయా దేశాల్లో ఖాతాలు తెరవాలంటే ఆ దేశ పౌరుడై ఉండాలని తెలిపారు.
మా మామ కోటీశ్వరుడు..
తన కుటుంబాన్ని క్షోభకు గురిచేసే విధంగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2009, 2014లో తాను ఈసీ ముందు పొందుపరిచిన ఆస్తుల వివరాలు పోల్చి చూడాలని కోరారు. 2009 తర్వాత తాను ఎక్కడా ఆస్తులు కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. గోపన్పల్లి, వట్టినాగులపల్లి, కొండారెడ్డి, కొడంగల్లో ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచామని వివరించారు. తనకు పిల్లను ఇచ్చిన మామ కిరోసిన్ హోల్సేల్ డీలర్ అని.. 1992 కంటే ముందే ఆయనకు హైదరాబాద్లో భూములు ఉన్నాయని రేవంత్ వెల్లడించారు. ఆ కాలంలోనే తన మామ పద్మనాభరెడ్డి ఆయన తండ్రి దుర్గా రెడ్డి కోటీశ్వరులని, కావాలంటే ఆ ఊరు వెళ్లి విచారించమన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు
కుట్రలను తిప్పికొట్టడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి, పొన్నం, డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు తదితరులకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదని అన్నారు.
కేసీఆర్ కుటుంబసభ్యులకు సవాల్..
తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని రేవంత్ తేల్చి చెప్పారు. అయితే కేసీఆర్ కుటుంసభ్యులు కూడా దీనికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ‘మన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం ప్రధాని మోడీకి లేఖ రాద్దాం. లేఖ రాసేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల్లో నా సవాల్కు బదులు ఇవ్వకుంటే కేసీఆర్ అవినీతి పరుడని ప్రజలకు అర్థమవుతుంది' అని రేవంత్ అన్నారు. రేవంత్ తెలంగాణలో ప్రచారం చేస్తే కేసీఆర్ ఓడిపోతారని సర్వేలలో తేలిందని, అందుకే ఎలాగైన మూడు, నాలుగు నెలలు తనను జైల్లో పెట్టాలని కుట్ర పన్నారని తెలిపారు. అందులో భాగంగానే మొదట ఐటి, ఈడీ, సీబీఐతో వరుస దాడులకు కుట్ర పన్నారని ఆరోపించారు.
నా వెంటపడుతున్నారు.. ఫిర్యాదు చేసినా..
కాగా, గత తొమ్మిది నెలలుగా అజ్ఞాత వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాహనాల నెంబర్లతో సహా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తన ఫిర్యాదుపై పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యే, వివిధ హోదాల్లో పనిచేసిన నాయకుడిగా తాను ఇచ్చిన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోలేదన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రైవేటు సైన్యానికి అధ్యక్షుడని రేవంత్ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలపైనా ఆయన మండిపడ్డారు.