ఓటుకు నోటు తెరపైకి అందుకే, బాబు అలా, నేను ఇలా: కేసీఆర్-మోడీ డ్రామా అంటూ రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. కేసీఆర్ సోమవారం పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికే జైలుకి వెళ్లి బెయిల్పై వచ్చిన రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.
మోడీ, కేసీఆర్ల నాటకం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే సోమవారం నాటి ఓటుకు నోటు కేసు సమీక్ష అని రేవంత్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం సోమవారం పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు.
మోడీకి బాబు దూరమవడంతో కేసీఆర్ ఇలా..
ఏపీకి ప్రధాని మోడీ అన్యాయం చేస్తున్నారని ఎన్డీఏ కూటమి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు మోడీని ఇబ్బందుల్లోకి నెట్టడంతో కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని అన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ వైఫల్యాలపై తాము పోరాడుతున్నామని, తాను కాంగ్రెస్ సభల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కారు ఎన్ని కోట్ల రూపాయల అనినీతికి పాల్పడిందో వివరిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో ఆలోచన కలుగజేస్తూ చైతన్యం తీసుకొస్తున్నానని రేవంత్రెడ్డి అన్నారు.
మోడీ ఆదేశాలతోనే.. ఓటుకు నోటుపై..
కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం కొనసాగించడానికి ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో ప్రజలకు వివరించి చెబుతున్నానని అన్నారు. ఎన్డీఏకి చంద్రబాబు దూరమవడం, టీఆర్ఎస్ సర్కారుపై తాను విమర్శలు చేయడంతో మోడీ, కేసీఆర్ ఈ విషయాలను జీర్ణించుకోలేకపోతున్నారని, మోడీ ఆదేశాల మేరకు కేసీఆర్ ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపారని రేవంత్ ఆరోపించారు.
కేసీఆర్ బంధువులు అవినీతికి పాల్పడవచ్చు..
కేసీఆర్ బంధువులైన అధికారులు వందల కోట్ల అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు. ఇతర అధికారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. డాక్టర్ శేషగిరి రావు, మరో అధికారి సంజీవరావు అవినీతికి పాల్పడిన వారిపై కేసులను ఉపసంహరించుకున్నారని, ఎందుకంటే వారు కేసీఆర్కు బంధువులని చెప్పారు. ఇలా 2016లో 125మంది అధికారులను అవినీతి కేసుల నుంచి తప్పించారని ఆరోపించారు.