భారీ భూ దందాకు కేసీఆర్ తెర..! ‘నయీమ్’ చీకటి కోణమే: రేవంత్ సంచలనం, ఆ పదాల్లేవ్!
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లక్ష్యంగా విమర్శల దాడిని కొనసాగించారు. తెలంగాణ భారీ ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఆయన బంధువులు, మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ భూ కుంభకోణంలో ఉన్నారని చెప్పారు.
భూ దందాలకు తెరలేపుతున్నారు..
అంతేగాక, లబ్ధిదారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో అసైన్డ్ భూములను కాజేసేందుకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాలకు తెరలేపనుందని అన్నారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్, జూపల్లి చేతుల్లో వేల ఎకరాలు
తాను నేరుగా సీఎం కేసీఆర్పైనే ఆరోపణలు చేస్తున్నానని, చిత్తశుద్ధివుంటే తన ఆరోపణలపై స్పందించాలని రేవంత్ సవాల్ విసిరారు. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగువేల ఎకరాల భూమి జూపల్లి రామేశ్వరరావు చేతిలో ఉందని ఆరోపించారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యూలరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని ఆరోపించారు.
జూపల్లి కోసమే కేసీఆర్ చట్టం..
రామేశ్వరరావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భూములను కట్టబెట్టారని రేవంత్ అన్నారు. శంషాబాద్, మహేశ్వరం మండలంలో రామేశ్వరరావుకు భూములెన్ని ఉన్నాయో.. వాటిలో అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. తన చుట్టమైన జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
నయీమ్ ఎన్కౌంటర్లో చీకటి కోణం
సీఎం, ఆయన బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని.. ధైర్యముంటే తనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాక, నయీమ్ ఎన్ కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
కేవలం ప్రశ్నిస్తున్నా..
ఈ మొత్తం భూ వ్యవహారంపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. తాను అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నానని ఇప్పటి వరకు విమర్శిస్తున్నారని.. అందుకే ఎలాంటి విమర్శలు లేకుండా.. ఇప్పుడు కేవలం ప్రశ్నిస్తున్నానని.. వాటికి సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. దాదాపు రేవంత్ విమర్శల్లో కొన్ని తిట్లు కూడా సాధారణంగా ఉంటాయి.. కానీ, ఇప్పుడు మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు.