నా ఫోన్ ట్యాపింగ్ చేశారు: రేవంత్ రెడ్డికి 'ఓయు' షాక్
హైదరాబాద్: అమరవీరుల కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండుతో కార్యక్రమం తలపెడితే, అమరవీరుల కుటుంబాలను సన్మానించేందుకు వెళ్లాలనుకున్నానని, తన ఫోన్ను ట్యాప్ చేసి విద్యార్థులతో మాట్లాడిన మాటలు విన్నారన్నారు.
తన డిమాండ్లలో కొన్నింటిని అమలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. అమరుల స్థూపాన్ని బుద్ధుడి పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీజీగానే పాపులర్ అయిందని, తాము అధికారంలోకి వచ్చాక టిఎస్ని టీజీగా మారుస్తామని చెప్పారు.
ఓయూలో ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు
ఓయులో ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఉత్తర్వులను అమలు చేయాలని ఓయూ రిజిస్ర్టార్, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓయూలో రాజకీయ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా సిటీ పోలీసులకు ఆదేశాలు జారీచేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాజకీయ పార్టీల సభలు, సమావేశాల నిర్వహణతో ఓయూలో రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంటూ న్యాయశాస్త్ర విద్యార్థి రాహుల్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బోధనలు, కాంపిటిటీవ్ పరీక్షలకు సిద్ధమవుతున్నవారితో విశ్వవిద్యాలయంలో ఉన్న వాతావారణం ఈ సమావేశాలతో కలుషితం అవుతుందని పిటిషనర్ వాదించారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్, స్థానిక పోలీస్ ఇంఛార్జిలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓయులో సభలకు అనుమతి మంజూరు చేయలేదని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ సురేష్కుమార్ తెలిపారు. కాగా, తనను ఓయులోకి వెళ్లకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఈ రోజు ఓయులో పర్యటించాలని భావించారు.