ఓవైపు బాబు-కెసిఆర్ భేటీ: మరోవైపు మండిపడ్డ రేవంత్, కార్తీక రెడ్డి ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు నిప్పులు చెరిగారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్కు తప్పకుండా షాకిస్తారని చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావులు తమ పార్టీ నేతలను లక్ష్యంగ చేసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీని దెబ్బకొట్టాలన్నదే వారి ఆలోచనని, వారి ఉద్దేశం నెరవేరదన్నారు.
కేసీఆర్ ఆగడాలు సాగనీయబోమని చెప్పారు. టిఆర్ఎస్ ఎన్ని రాజకీయాలు చేసినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెలుగుదేశం - బిజెపి కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. కాగా, కెసిఆర్ బెజవాడ వెళ్లి చంద్రబాబును యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
జైలు శిక్ష పడిన పటాన్ చెరు ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించి నారాయణఖేడ్ ఎన్నికలతో పాటు పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ టిడిపి నేతలు వేరుగా డిమాండ్ చేశారు. వారు గవర్నర్ నరసింహన్కు వినతిపత్రం ఇచ్చారు.
నన్ను పక్కన పెట్టారు: కార్తీక రెడ్డి
తనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే పక్కన పెట్టారని గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ నేతలు కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
సోనియాను పిలువలేదేం: పొంగులేటి
తెలంగాణ సీఎం కెసిఆర్ తాను చేస్తున్న చండీయాగానికి అందరినీ పిలుస్తున్నారని కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. లోక కళ్యాణం కోసం యాగం చేస్తే సంతోషమే అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమలోని లోపాల వల్లే ఓడామని, తెరాస ప్రతిభ వల్ల ఓడలేదని చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్కు పట్టిన గ్రహణం వీడుతుందన్నారు.