నిరుద్యోగుల గుండెలను గాయపరుస్తున్నారు..: కేసీఆర్కు రేవంత్ లేఖ
నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలు నిరుద్యోగుల గుండెలను గాయపరుస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓవైపు ర్యాలీని విజయవంతం చేసేందుకు కోదండరాం అండ్ కో సర్వ శక్తులు ఒడ్డుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నుంచి మాత్రం ప్రతికూలతలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలు నిరుద్యోగుల గుండెలను గాయపరుస్తున్నాయని అన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం వస్తే భారీగా కొలువులు వస్తాయని ఆశించిన యువత.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటన విని ఉద్యోగాలపై మరింతగా నమ్మకం పెట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటన మాత్రం నిరుద్యోగులను పూర్తిగా నిరాశలోకి నెట్టిందన్నారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో టీడీపీ తొలినుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూనే ఉందని రేవంత్ తెలిపారు. నిరుద్యోగులు మరోసారి తమ ఆకాంక్షను ప్రభుత్వానికి చాటేలా నిరుద్యోగ నిరసన ర్యాలీని చేపట్టారని, అందుకు అనుమతివ్వకపోగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం నిరుద్యోగులను అసంతృప్తికి గురిచేస్తుందని లేఖ ద్వారా చెప్పుకొచ్చారు.