గుట్టు విప్పుతున్న రేవంత్ రెడ్డి: కెసిఆర్కు అదనపు చిక్కులు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావుకు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అదనపు చిక్కులు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్ర ఆధిపత్యాన్ని వ్యత
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావుకు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అదనపు చిక్కులు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్ర ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ సాగిన తెలంగాణ ఉద్యమం కెసిఆర్ విధానాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఇస్తుందనే భావనకు తెలంగాణ ప్రజలు మరింతగా గురయ్యే అస్త్రాలను రేవంత్ రెడ్డి బుధవారంనాడు సంధించారు.
ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి
ఈనాడు అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణలకు కెసిఆర్ ఇస్తున్న ప్రాధాన్యంపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తందార్ల ప్రయోజనాలే నెరవేరుతున్నాయనే ఉద్దేశ్యానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల మరింత బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కెసిఆర్ దోస్తీ గుట్టును దాదాపుగా రేవంత్ రెడ్డి విప్పారని చెప్పవచ్చు. మరిన్ని విషయాలను ఆయన కాలక్రమంలో బయటపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఆంధ్ర మంత్రులకు ఇలా....
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కెసిఆర్తో ఉన్న అనుబంధం గుట్టును రేవంత్ రెడ్డి విప్పారు. యనమల రామకృష్ణుడికి రూ. 2వేల కోట్ల కాంట్రాక్టును, పరిటాల సునీతకు హైదరబాదులో బీర్ల కంపెనీ లైసెన్సు కెసిఆర్ కట్టబెట్టారని ఆయన చెప్పారు. కెసిఆర్తో వెల్కమ్ వ్యూహం గురించి చర్చలు జరిపిన టిడిపి నేత పయ్యావుల కేశవ్పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కోదండరామ్ ఇలా చెప్పారు....
మిషన్ కాకతీయ కాంట్రాక్టులు ఆంధ్రవాళ్లవి కాగా, సబ్ కాంట్రాక్టులు తెలంగాణవారివని ఇటీవల తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. దానివల్లనే అప్పట్లో తిరుపతి వెళ్లిన కెసిఆర్కు ఘన స్వాగతం లభించిందనే అభిప్రాయం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్థానికులకు ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో మరింత బలపడే అవకాశం ఉంది.
కెసిఆర్పై నిరంతర పోరాటం....
ఓటుకు నోటు కేసులో అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కెసిఆర్పై తన దూకుడును తగ్గించలేదు. ఈ కేసుతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారని భావించారు. కానీ, అది జరగకపోగా ఆయన మరింతగా రెచ్చిపోతూ వాగ్బాణాలు సంధిస్తూ వస్తున్నారు. తన పోరాటానికి విఘాతం కలుగుతోందనే అభిప్రాయం బలవడగానే ఆయన టిడిపిని వదలడానికి సిద్ధపడడమే కాకుండా ఆంధ్ర నాయకులతో కెసిఆర్ కలిసిపోయిన వైనాన్ని బయటపెడుతూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది
దైర్యం ఏమిటి....
ఓటుకు నోటు కేసు తనను చిక్కుల్లో పడేస్తుందనే భయం రేవంత్ రెడ్డి వెనకడుగు వేయిస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ, ఆయన ధైర్యంగా మాట్లాడడాన్ని బట్టి ఆ భయం ఉన్నట్లు కనిపించడం లేదు. తాను టిడిపి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడరా అనేది ప్రశ్న. అయితే, కేసు తన మీదికి వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దర్యాప్తు సంస్థ కోర్టులో వేసిన చార్జీషిట్లో చంద్రబాబు పేరు చాలా సార్లు ఉంది. అదే రేవంత్ రెడ్డి దైర్యం కావచ్చునని అంటున్నారు.