మల్కాజిగిరిలో గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు, మరో పార్టీ గడప తొక్కిన యువనేత
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తన గెలుపు కోసం ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే ఆధారపడటం లేదు. తన గెలుపుకు కృషి చేయాలంటూ ఆదివారం లెఫ్ట్ పార్టీ నేతలను కలిశారు. తాజాగా, సోమవారం తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాంతో గంటసేపు భేటీ అయ్యారు.
మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానని, మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. మల్కాజిగిరిలో గెలవడానికి కోదండరాం సహకారం అవసరమని చెప్పారు. మల్కాజిగిరి మినీ భారతమని, ఇక్కడి సమస్యలపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, ఇంతమంది ఎంపీలు ఉండి ఈ అయిదేళ్లలో ఏం సాధించారన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతులు ఉండాలన్నారు. పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెబుతామన్నారు.
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
అందుకే 16 ఎంపీ సీట్లు గెలిపించమంటున్నారు
తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకొనేందుకే కేసీఆర్ 16 ఎంపీ సీట్లు కోరుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తామని కేసీఆర్ చెప్పడంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ స్థాపించడంలో ఉపయోగమేమీ లేదన్నారు. ఫిరాయించిన వారితో కలిపి దాదాపు అయిదేళ్లుగా కేసీఆర్ వద్దే పదహారు మంది ఎంపీలు ఉన్నారని, అయినా ఏమీ సాధించలేకపోయారన్నారు.
అందుకే తెజస మద్దతు కోరా
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున అక్కడ తెలంగాణ జన సమితి శ్రేణుల మద్దతు కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన కోదండరాం వద్ద సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రకటించిందని, విభజన చట్టంలోనూ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కాంగ్రెస్ పొందుపర్చిందని, హామీలన్నీ రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
చర్చించి నిర్ణయం తీసుకుంటాం
తెలంగాణలో తెజస రెండు లేదా మూడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుందని, మిగతా చోట్ల కాంగ్రెస్కు మద్దతిస్తామని ఈ సందర్భంగా కోదండరాం చెప్పరు. జిల్లా కమిటీతో మాట్లాడి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి మద్దతిచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, రేవంత్ రెడ్డి ఆదివారం సీపీఐ నేతలను కలిసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి తమ మద్దతు కోరడం శుభపరిణామమని, బీజేపీ హఠావో, దేశ్ బచావో అని తమ పార్టీ పిలుపునిచ్చిందని, అందులో భాగంగా లౌకిక శక్తులకు సహకారం అందిస్తామని సీపీఐ చాడ చెప్పారు. సీపీఐ పోటీ చేసే స్థానాలు, మద్దతిచ్చే స్థానాలపై రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తామన్నారు.