రేవంత్ రెడ్డి అష్టదిగ్బంధనం..!ఎన్నికల ప్రచారం రోజే సోదాలు.! కుట్ర అంటున్నరేవంత్ అనుచరులు..!
హైదరాబాద్: తెలంగాణలో అదికార పార్టీని, ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావునీ కాలి గోటితో పోల్చుతూ దుమ్మెత్తి పోసిన నేతగా గులాబీ వ్యతిరేకవర్గంలో రేవంత్రెడ్డికి ప్రత్యేకస్థానం ఉంది. ఓటుకు నోటుకేసులో అవినీతి పరుడంటూ పత్రికలు పతాకశీర్షికలతో వార్తలు రాసినా, అభిమానుల్లో ఇసుమంతైనా ఆదరణ తగ్గలేదు. రేవంత్ జైలు నుంచి విడుదలైన రోజున, హైదరాబాద్ నడిబొడ్డున భారీఎత్తున తీసిన ర్యాలీ ఔరా అనిపించింది. తోక తొక్కిన కోడె నాగులా రేవంత్ రెడ్డి అనుచరులు రెచ్చి పోయారు. కేసుల ఊసుల సాకుతో రేవంత్ రెడ్డి ని ఎంత అణచి వేయాలని చూసారో అంతకు రెట్టించి ప్రజల్లోకి దూసుకెళ్లారు రేదంత్ రెడ్డి. ఇక చివరగా ఈడి, ఐటి శాఖల సోదాలతో రేవంత్ రెడ్డి ని అష్టదిగ్బందనం చేసేందుకు మరో తాజా ప్రయత్నం జరుగుతోంది.
Recommended Video
'ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు'
రేవంత్ రెడ్డి నివాసాలపై మెరుపు సోదాలు..! ప్రభుత్వ కుట్రపూరిత చర్యలే అంటున్న అనుచరులు..!
తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న రేవంత్ను బలహీనపరచటం టీఆర్ఎస్ ముందున్న సవాల్ గా పరిణమిందచింది. అందుకే.. కొమ్మలను నరికితే చాలదనే ఉద్దేశంతో, కూకటివేళ్లతో సహా పెరికేయాలని పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగానే కొడంగల్ లోనే, రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీనేతలంతా పాగావేశారు. ఇక్కడ రేవంత్ను ఓడించే బాధ్యతలను టీఆర్ఎస్ నేత హరీష్రావుకు అప్పగించారు.అంతే, దాదాపు రోజుకు ఒక్కసారైన అక్కడి నేతలతో ఆయన మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడిక లోకల్ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేశారు.
రేవంత్ ని నిలువరించడమే లక్ష్యం..! కొండంగల్ అభిమానులకు గాలం..!
టీడీపీ, హస్తం నేతలకు గులాబీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మీకు ఏం కావాలో అది చేస్తాం. మీరు కోరుకున్నది కాళ్లముందుకు వస్తాయంటూ హామీలు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ను ఇరుకున పెట్టేందుకు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై గతంలో నమోదైన కేసులను బయటకు తీశారు. రెండ్రోజుల క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్ను విచారించారు. గతంలో ధర్నాలు, ఆందోళనలు, పోలీసులకు అందిన ఫిర్యాదుల జాబితాను కూడా వెలికితీసేపనిలో పడ్డారు పోలీసులు. ఈ లెక్కన, మానసికంగా, రాజకీయంగా, రేవంత్ను దెబ్బతీయడంతో పాటు, కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలనేది గులాబీ నేతల అంతరంగంగా తెలుస్తోంది.
రేవంత్ ను కట్టడి చేయాలి..! కొడంగల్ లో జెండా పాతాలి..! ఇదే అదికార పార్టీ కర్తవ్యం..!
అందుకే నలువైపులా దాడి చేయటం ద్వారా రేవంత్ను ఒంటరి చేయటం, ఓటమి అంచుకు చేర్చటమే లక్ష్యంగా హరీష్ కనుసన్నల్లో వ్యూహరచనకు పదను పెడుతున్నట్టు సమాచారం. ఐటీ సోదాలు అక్రమ కేసులు అన్నింటినీ తట్టుకుని నిలబడగల సత్తా రేవంత్కు ఉందని ఆయన అనుచరులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సీతక్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి రేవంత్ కు బాసటగా నిలిచారు. ఐటి సోదాలను ఖండించారు. ప్రచారానికి శ్రీకారం చుట్టిన రోజునే సోదాలకు పాల్పడటం పిరికి చర్య అంటూ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.
రహస్య సమాచారం ఇచ్చిన లాయర్..! రేవంత్ ను ఎలాగైనా ఇరికించాలని రామారావు ప్రయత్నాలు..!
గురువారం ఉదయం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ, ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తుండగా, ఈ దాడుల వెనుక రామారావు అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదే కీలకమని తెలుస్తోంది. ఇటీవల సీబీఐకి ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేస్తూ, రేవంత్ బంధువు జయప్రకాశ్ తదితరులు 10 నుంచి 15 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి 300 కోట్లకు పైగా నిధులను మళ్లించారని ఆయన ఆరోపించారు. సాయిమౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హైదరాబాద్, జూబ్సీహిల్స్ పరిధిలోని ఇంటి నంబర్-346 చిరునామాతో ఈ కంపెనీలు ఉన్నాయని కూడా ఆయన ఉప్పందించగా, ఈ ఫిర్యాదును పరిశీలించాలని సీబీఐ నుంచి ఈడీకి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఏక కాలంలో రేవంత్ రెడ్డి, ఆయన బందు మిత్రుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.