కెసిఆర్ టార్గెట్: రేవంత్ రెడ్డి బిజెపి సిఎం అభ్యర్థి, కోమటిరెడ్డి బ్రదర్స్ వెనక్కి...
కెసిఆర్ను టార్గెట్ చేయడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్నుఅమిత్ షా రూపొందిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి విస్తరించడానికి అవకాశాలు లేవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావు గట్టిగానే నమ్ముతున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా ఆయన అదే విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, కెసిఆర్ను టార్గెట్ చేయడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఢిల్లీలో అమిత్ షా పలకరించినా మొదట పట్టనట్లు వ్యవహరించారని అంటున్నారు.
అమిత్ షా తనంత తానుగా పలకరించడానికి వస్తే చూడనట్లు కెసిఆర్ ముఖం తిప్పేసుకున్నారని వార్తలు వచ్చాయి. రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అది జరిగింది. ఆ తర్వాత కెసిఆర్ తానే స్వయంగా అమిత్ షాను పలకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్....
తెలుగుదేశంం పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ నాయకత్వం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి కొంత సమయం కావాలని అడిగినట్లు చెబుతున్నారు.
సమయం ఎందుకు...
తాను బిజెపిలోకి వస్తే తనతో పాటు మరో 40 మంది శానససభ్యులు వస్తారని, వారందరినీ ఒప్పించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి బిజెపి నాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. ఆ 40 మంది ఎమ్మెల్యేలతో పాటు మిగతా నాయకుల ప్రయోజానాలను కూడా తాను కాపాడాల్సి ఉంటుందని, ఇదంతా జరగడానికి తనకు సమయం కావాలని ఆయన అడిగినట్లు చెబుతున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ వెనక్కి....
నిజానికి కాంగ్రెసు నేతలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారని గతంలో ప్రచారం జరిగింది. అమిత్ షాతో చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వారు కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వారు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఎందుకు వెనక్కి.....
కోమటిరెడ్డి బ్రదర్స్ తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్న బిజెపి జాతీయ నాయకత్వం ఆ పదవి ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి పదవి, రాష్ట్రంలో ఇస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్కు బిజెపి నాయకత్వం చెప్పినట్లు సమాచారం. దానికి ఇష్టపడని కోమటిరెడ్డి బ్రదర్స్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డే ఎందుకు....
రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బిజెపి జాతీయ నాయకత్వం అనుకోవడం వెనక బలమైన కారణమే ఉందని అంటున్నారు. ఆయన తొలుత బిజెపిలో ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వచ్చారు. తెలుగుదేశంపార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రేవంత్ రెడ్డికి తొలినాళ్లలో బిజెపితో అనుబంధం ఉందనే కారణంతోనే కాకుండా కెసిఆర్ను టార్గెట్ చేయగల నాయకుడిగా గుర్తింపు పొందిన కారణంగా కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.