అందుకే టీడీపీని వదిలేశా: మోడీని లాగిన రేవంత్, సోనియాను ఆకాశానికెత్తారు
రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ చేరిక, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ చేరిక, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అనంతరం ఉత్తమ్, మధుయాష్కీ, కుంతియా, వి హనుమంత రావులు రేవంత్తో కలిసి ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్ సహా 18 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Recommended Video
వీరంతా చేరారని ఉత్తమ్
రేవంత్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), బోడ జనార్ధన్, వేం నరేందర్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, సత్యనారాయణ, ఎం సత్యం, హరిప్రియ నాయక్, బిల్యా నాయక్, రాజారాం యాదవ్, విజయరమణా రావు, భూపాల్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, పొట్ల నాగేశ్వర రావు, దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, చారగొండ వెంకటేష్, సతీష్ మాదిగ, రఘు కిరణ్, ప్రశాంత్, చెన్న యాదవ్, జ్ఞానేశ్వర్, రాము తదితరులు టీడీపీలో చేరినట్లు ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఈ సందర్భంగా ప్రకటించారు.
కేసీఆర్ కుటుంబమే లాభపడింది
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబమే లాభపడిందని కుంతియా మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజల పక్షాణ నిలిచేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు.
సోనియా తెలంగాణ ఆకాంక్షను గుర్తించారు
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినట్లుగా తనను చూడవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 1500 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారని చెప్పారు. 1969లో 369 మంది, 2000 తర్వాత తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారన్నారు. తెలంగాణ ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ తనకు రాజకీయ లబ్ధి చూడకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.
ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసీ ఇచ్చారు
2014లో తమకు రాజకీయంగా లబ్ధి చేకూరదని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేందుకే మొగ్గు చూపారని రేవంత్ చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నో ఆత్మార్పణలు జరిగాయని, వాటిని చూసి సోనియా కదిలిపోయి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో గుర్తించారన్నారు. ఏపీలోను తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.
ఇప్పటి దాకా ఆ జాబితా తయారు చేయలేదు
తెలంగాణ కోసం పోరాడినమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుల జాబితాను కూడా తయారు చేయలేకపోయిందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. అరవై ఏళ్ల పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడిందన్నారు.
అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలు విడిచిపెట్టాను
ఏపీలో టీడీపీ అధికారంలో ఉందని, కేంద్రంలో టీడీపీ ఉన్న ఎన్డీయే అధికారంలో ఉందని, కానీ తాను మాత్రం తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. రాహుల్ నేతృత్వంలో పని చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యారని, కొడుకు, అల్లుడు మంత్రి అయ్యారని, ఆ కుటుంబంలో నలుగురికి పదవులు వచ్చాయన్నారు.
మోడీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు
ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ఆయనకు అందరూ మద్దతివ్వాలని రేవంత్ అన్నారు. తమకు మీడియా మద్దతు కావాలని కోరారు. తెలంగాణ వస్తే ఎన్నో జీవితాలు బాగుపడుతాయనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. తెలంగాణ ప్రజలు బాగుండాలని కేసీఆర్ ఆశించారన్నారు. అందుకే ఏం ఆశించకుండా తెలంగాణను ప్రకటించారని చెప్పారు.