మన సీఎంకి ‘కుంభకర్ణ’ అవార్డు ఇవ్వాలి: మళ్లీ ట్వీట్తో విరుచుకుపడిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్ 'కుంభకర్ణుడు'గా అభివర్ణించారు.
గత శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన రైతు గర్జన కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కీలకవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ నరసింహాన్కు సీఎం.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావులా కనిపిస్తుంటే.. తమకు మాత్రం ఆయన క.చ.ర చంద్రశేఖర్ రావులా కనిపిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ టీడీపీకి గుడ్బై చెప్పి బయటికొచ్చిన సందర్భంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన పోరాటం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్పైన మాత్రమేనంటూ తన టార్గెట్ ఎవరో చెప్పేశారు. ఆ తరువాత నుంచి అవకాశం దొరికిన ప్రతిసారీ ఆయన సీఎం కేసీఆర్పై విరుచుకుపడుతూనే ఉన్నారు.
Our Chief Minister should be given the ‘Kumbhakarna award’ on completing one year of ‘work from home’ in sleeping mode, without stepping into the ‘secretariat’.. #sleepingmodeCM @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) February 3, 2018
అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ను 'కుంభకర్ణుడు'గా అభివర్ణించారు. కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంటినుంచే వ్యవహారాలు చక్కబెడుతుండంపై రేవంత్ విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.
'సచివాలయంలోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి 'కుంభకర్ణ అవార్డు' ఇవ్వాలి.. నిద్రావస్థలో ఉన్న సీఎం @ తెలంగాణ సీఎంఓ' అంటూ రేవంత్ తన ట్వీట్లో ఘాటుగా విమర్శించారు.