కేటీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ..
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని.. నాలుగేళ్ల కాలంలోనే ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని లేఖలో ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో 111ను సమీక్షించాలనుకోవడం కుట్ర అని ఆరోపించారు. కేటీఆర్ అవినీతిపై నిజానిజాలను తేల్చి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
నాలుగేళ్లలో అంత ఆస్తి ఎలా వచ్చింది..
2014లో కేటీఆర్ ఆస్తి రూ.8కోట్లుగా ఉందని,2018 నాటికి రూ.41కోట్లకు ఎలా పెరిగిందని రేవంత్ లేఖలో ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విరాళాలు రూ.188కోట్లకు పెరగడం వెనక రహస్యమేంటని నిలదీశారు. ఓవైపు రాష్ట్రం రూ.3లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం వేల కోట్లకు ఎలా అధిపతులవుతున్నారని ప్రశ్నించారు.త్యాగాల తెలంగాణలో మీరు భోగాలు అనుభవిస్తున్నారని.. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు.
రియల్ మాఫియాతో చేతులు కలిపి..
రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో.111ని సమీక్షిస్తానని కేటీఆర్ చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. జీవో.111 పరిధి నుంచి కొన్ని గ్రామాలకు మినహాయింపు కుట్ర ఉందని ఆరోపించారు. జీవో.111 పరిధిలోని నిబంధనల ప్రకారం.. ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు,వెంచర్ల నిర్మాణం చేయరాదన్నారు. కానీ కేటీఆర్ మాత్రం బినామీ పేరుతో జీవో.111 పరిధిలో రాజమహల్ నిర్మించారని ఆరోపించారు.
విచారణకు ఆదేశించకుంటే కోర్టు.. : రేవంత్
చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు.. ఉద్యమాల తెలంగాణను టీఆర్ఎస్ నేతలు చెరబట్టారని రేవంత్ మండిపడ్డారు. గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా సొంతమయ్యాయని ప్రశ్నించారు. కేటీఆర్పై కేసీఆర్ విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. త్వరలోనే కేటీఆర్ అవినీతి బాగోతాలపై సమగ్ర వివరాలు,ఆధారాలతో పుస్తకం వేస్తామని లేఖలో స్పష్టం చేశారు.
మున్సిపల్ ప్రచారంలో..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. త్వరలో కొత్త టీపీసీసీ చీఫ్ను నియమించే అవకాశం ఉండటంతో.. ఆ పదవి కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా టీపీసీసీ చీఫ్ రేసులో ముందుండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్కు పోటీగా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తుండటంతో.. కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఎవరికి పదవి కట్టబెడుతుందోనన్నది చర్చనీయాంశంగా మారింది.