కేటీఆర్ వరంగల్ లో షో చేస్తే సరిపోతుందా? రైతుల పంటనష్టం మాటేంటి ? కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో కొడుకు పై ఉన్న ప్రేమ సీఎం కేసీఆర్ కు రైతులపై లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే, సీఎం కేసీఆర్ రైతులకు జరిగిన పంట నష్టాన్ని గురించి ఆలోచించకుండా పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తు నాయకుడిగా కేటీఆర్ కు గుర్తింపు తీసుకురావడం కోసం ఈ సంక్షోభ సమయాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టం .. రైతుల ఇబ్బందులు పట్టవా ?
వరంగల్, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ లతోపాటు దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. క్షేత్రస్థాయిలో పంట నష్టంతో రైతులు బాధపడుతుంటే, పట్టించుకోవాల్సిన భాద్యతను అధికారులకొదిలేసి ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఆక్షేపణీయం అని కేసీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేటీఆర్ ను ప్రత్యామ్నాయంగా చూపించే పనిలో వరంగల్ లో షో
మీ కుమారుడి రాజకీయ వారసత్వ ప్రక్రియను మరింత పటిష్టం చేసుకోవడానికి, భవిష్యత్తు టిఆర్ఎస్ నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో గుర్తింపు తీసుకురావడానికి బాగానే ప్రయత్నం చేస్తున్నారని, మీకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్ ను చూపించే ప్రయత్నం తప్ప ప్రజల కష్టాలను ,రైతుల ఆవేదన తీర్చే చిత్తశుద్ధి మీ చర్యల్లో ఇసుమంతైనా కనిపించలేదని రేవంత్ పేర్కొన్నారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ అర్బన్ లో షో చేసి బాధ్యత తీర్చేసుకున్నారని , కానీ రైతుల కష్టం తీర్చే ప్రణాళిక ఏదైనా ఉందా అంటూ రేవంత్ ప్రశ్నించారు.
కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
కొడుకు పై ఉన్న ప్రేమ రైతులపై లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం ఉందని,ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అని ప్రశ్నించారు రేవంత్. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్ర స్థాయి పర్యటనకి వెళ్ళింది లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. చాలా పొలాలలో ఇసుకమేట వేసిందని,భూమి కోతకు గురై పంట కొట్టుకుపోయిందని ఇదంతా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ ముందు రైతుల కోసం రేవంత్ డిమాండ్లు ఇవే
వ్యవసాయ శాఖ మంత్రి తక్షణం క్షేత్ర పర్యటన కు వెళ్లి త్వరితగతిన పంటనష్టాన్ని అంచనా వేయించాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. దీని కోసం వెయ్యి కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని రేవంత్ అన్నారు. తిరిగి పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చాలని, ఫసల్ బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వరదల కారణంగా ఇసుకమేటతో, భూమి కోత తో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ భూములు బాగు చేసుకోవడానికి ఎకరానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి డిమాండ్లను ముందుంచారు.