టీపీసీసీ చీఫ్ ఎంపికలో ట్విస్ట్: రేవంత్కు ఛాన్స్ లేదు: కరీంనగర్ నేతే కొత్త పీసీసీ చీఫ్..!
తెలంగాణ కాంగ్రెస్లో గతకొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్ష పదవిపై నెలకొన్న సస్పెన్స్ దాదాపుగా వీడింది. గత కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుందనే జరిగిన ప్రచారంకు హస్తం పార్టీ చెక్ పెట్టింది. పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కాదన్న కాంగ్రెస్ హైకమాండ్ కొత్తగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కొత్త పీసీసీ చీఫ్ జీవన్ రెడ్డి ..?
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఆ పదవిని చేపడతారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా టీపీసీసీ పదవికి రేసులు ఉన్నారు. అయితే వీరిని కాదని కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ సీనియర్ నేత కరీంనగర్ వాసి అయిన జీవన్ రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైనట్లు సమాచారం. అధికారికంగా మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్లోని జీవన్ రెడ్డి నివాసం వద్ద, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద కార్యకర్తలు జీవన్ రెడ్డి అభిమానులు సంబురాలు చేస్తుండటంతో దాదాపుగా జీవన్ రెడ్డిని పీసీసీ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం
రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలు..?
ఇక మొదటి నుంచి పీసీసీ పదవికి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు వినిపించింది. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది వ్యతిరేకించారు. సీనియర్లు వ్యతిరేకించడంతోనే పార్టీ చాలా జాగ్రత్తగా పేర్లను పరిశీలించడంతో పీసీసీ ఎంపికలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్కు అధిష్టానం సర్ది చెప్పింది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మెన్గా బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోమవారం ఓ టీవీ చర్చలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పారు.
తెలంగాణ పాలిటిక్స్ కేరాఫ్ కరీంనగర్
ఇక తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారబోతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి ఎంపిక దాదాపుగా ఖరారు కావడంతో ఆయన కూడా కరీంనగర్ జిల్లాకు చెందడంతో ఇక పాలిటిక్స్ కేరాఫ్ కరీంనగర్గా మారనున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కరీంనగర్ నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండగా... కరీంనగర్ ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడా వెంకట్ రెడ్డి కూడా కరీంనగర్కు చెందిన వ్యక్తి కావడం విశేషం. దీంతో ఎత్తులు పొత్తులకు కేరాఫ్గా కరీంనగర్ మారే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాలకు కొత్త వేదికగా కరీంనగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.