బాబువల్లే పీవీకి, ఇస్తానన్న కేసీఆర్ కక్కుర్తితో: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. దివంగత నేత పీవీ నర్సింహా రావుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారక స్థూపం తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే సాధ్యమైందని చెప్పారు.
కేసీఆర్ సెంటిమెంటును అడ్డు పెట్టుకొని పాలన చేస్తున్నారని విమర్శించారు. 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుండి కరెంట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ కమీషన్కు కక్కుర్తిపడి ప్రయివేటు సంస్థల నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
భూ కబ్జాదారులే గెలిచారు: సీతక్క
భూకబ్జాలకు పాల్పడిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచారని, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉదంతమే ఇందకు నిదర్శనమని టీడీపీ నేత సీతక్క వరంగల్ జిల్లాలో అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో శిఖం భూములను క్రమబద్ధీకరించి కాజేయాలని చూస్తున్నారని సీతక్క ఆరోపించారు.
12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన
ఈనెల 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన ఉండనుంది. పర్యటనలో భాగంగా యువనేత లోకేశ్ పలు ప్రమాదాల్లో మృతిచెందిన 50 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా చెక్కులు అందించనున్నారు.