ఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్లో ఇంటికి రాక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోస్గిలో ఎన్నికల ప్రచారంలో ఉద్వేగంగా మాట్లాడారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఐటీ దాడులు జరుగుతుంటే, మరోవైపు ఆయన ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డప్పు కొట్టి ఆనందించారు. ఆయన ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు.
Recommended Video
హైదరాబాద్ రండి.. ప్రచారంలో ఉన్నా: ఐటీ అధికారులకు రేవంత్, ముఖంలో లేని టెన్షన్
అయితే కోస్గిలో ఆయన మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగంగా ప్రసంగించారు. ఇదే తన చివరి ఉపన్యాసం కావొచ్చునని చెప్పారు. జైలులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కొడంగల్ నుంచి నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
జైల్లో పెట్టినా నామినేషన్ వేస్తా
కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాలనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ఈ రోజు తన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా
అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తానని, లేదంటే జైలు నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్ చెప్పారు. కొడంగల్ ప్రజలపై నమ్మకంతో తాను హైదరాబాద్ వెళ్తున్నానని అన్నారు. తాను జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నానని, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించే వరకు నిద్రపోనని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక , ఏం చేయలేక ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు.
హైదరాబాద్కు రేవంత్ రెడ్డి
కాగా, అనంతరం ఆయన కోస్గి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఐటీ దాడులు, ఆయన రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రేవంత్ రెడ్డి సోదరుడికి ఐటీ నోటీసులు
రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు గురువారం సాయంత్రం ముగిశాయి. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కొండల్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది.