కష్టకాలం... పోటీకి నేను రెడీ ఎందుకంటే, కేసీఆర్ 'గచ్చిబౌలి దివాకర్': రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే లోకసభకు పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం చెప్పారు. తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి సమయంలో ఓ నాయకుడిగా తమ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లుగా నడుచుకోక తప్పదన్నారు.
ఫలించని రేవంత్ మంత్రాంగం, టీఆర్ఎస్లోకి సబిత ఇంద్రారెడ్డి: రాహుల్ గాంధీ రంగంలోకి దిగినా..
పోరాటం.. నా బాధ్యత
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ, లోకసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత, అవసరం ముఖ్య నేతల్లో ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్లో ఉన్నాయని చెప్పారు. పోరాడే సమయంలో నాయకుడు పోరాటం చేయక తప్పదని, ఇది తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
బీజేపీ సత్తా చూపించి ఆ తర్వాత ఓడిపోయింది
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చేదు అనుభవం ఎదురైందని, ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల్లో సత్తా చాటుతారా అంటే రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ చెప్పారు. 2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీ అధిక మెజార్టీతో గెలిచిందని, ఢిల్లీలో అన్ని సీట్లు కమలం పార్టీ కైవసం చేసుకుందని, కానీ ఆ తర్వాత మూడు నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఓడిపోయిందని గుర్తు చేశారు.
కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్
తెలంగాణ సీఎం కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే, కాంగ్రెస్ పార్టీ సచిన్ టెండుల్కర్ వంటిది అని రేవంత్ రెడ్డి అన్నారు. సంప్రదాయాల పేరిట టీఆర్ఎస్... కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందని, మరి కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు గెలిచే బలం ఉన్నప్పటికీ కేసీఆర్ అభ్యర్థిని ఎలా నిలబెట్టారని ప్రశ్నించారు.