రిలీజ్ చేశాం: ఏజీ, హైకోర్టు ప్రశ్నల వర్షం, 'రేవంత్ ఓ బ్రహ్మోస్ మిసైల్.. తెరాస కథను ముగిస్తాడు'
హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విడుదల చేసినట్లు అడ్వోకేట్ జనరల్ (ఏజీ) మంగళవారం హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఏజీ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం అరెస్టు వ్యవహారంపై ప్రశ్నించింది.
రేవంత్రెడ్డి అరెస్ట్పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్
రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని అడిగింది. పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్తో పాటు మరికొందరి అరెస్టులకు సంబంధించి కారణాలను రేపు సమర్పిస్తామని ఏజీ... కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను న్యాయస్థానం రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.
ప్రభుత్వం, పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం
రేవంత్ రెడ్డి అరెస్టు పైన హైకోర్టు ప్రభుత్వానికి చురకలు అంటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రచారం నేపథ్యంలో బంద్ పాటిస్తే తప్పేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఆయనను అరెస్టు చేయడానికి ఆధారాలు ఏమిటని అడిగింది. రేవంత్ వల్ల శాంతిభద్రతల సమస్య ఎలా తలెత్తుతుందో చెప్పాలని అడిగింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయకుంటే శాంతిభద్రతల సమసమయ ఎలా తలెత్తుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అరెస్టు చేశామని చెప్పగా, అందుకు సంబంధించిన కాపీ ఇవ్వాలని అడిగింది. ఆయన అరెస్టుకు సంబంధించిన ఆధారాలు రేపు ఇస్తామని పోలీసులు తెలపగా.. ఓ సమయంలో సక్రమంగా అరెస్టు చేస్తే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఈ రోజే ఆధారాలు ఇవ్వాలని అంతకుముందు చెప్పింది. ఆ తర్వాత రేవంత్ను విడుదల చేయాలని ఈసీ చెప్పింది. అనంతరం ఆయనను విడుదల చేశారు. ఇదే విషయాన్ని సాయంత్రం కోర్టుకు చెప్పిన ఏజీ.. అరెస్టుకు సంబంధించిన వివరాలు రేపు ఇస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి విడుదల
మంగళవారం వేకువజామున మూడు గంటలకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రానికి, దాదాపు 13 గంటల హైడ్రామా అనంతరం విడుదల చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో భారీ భద్రత మధ్య కొడంగల్ తీసుకు పోయారని తొలుత భావించారు. అయితే ఆయనను కొడంగల్ కాకుండా హైదరాబాద్ తరలించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ అరెస్టును నిరసిస్తూ తెలంగాణలో పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు. గజ్వెల్లో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.
రేవంత్ రెడ్డి మా బ్రహ్మోస్
పోలీసులను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని, వారు బెడ్రూంలోకి వచ్చి కూడా అరెస్టు చేసేలా చేస్తున్నారని, దేశంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, రేవంత్ రెడ్డి ఒక సాధారణ వ్యక్తి కాదని, ఆయన ఒక బ్రహ్మోస్ మిసైల్ అని, ఆ మిసైల్ తెరాస కథను ముగిస్తుందని కాంగ్రెస్ నేత జీఎన్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎన్నికల కమిషన్ పరిధిలో నడవాలని చెప్పారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మర్రి డిమాండ్ చేశారు.
మనీష్ తివారీ ఆగ్రహం
రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. తెలంగాణలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగడంలేదన్నారు. గతంలో కూడా కోదండరామ్ను ఇలానే అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఫ్రెండ్లీ పోటీలో ఉన్నాయన్నారు. తెరాసకు, మజ్లిస్ పార్టీలలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే అన్నారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని చెప్పారు. అధికార, ధన బలం ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు.
వీడియో కలకలం
రేవంత్ రెడ్డి అరెస్ట్ కలకలం రేపిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో తెరాస కార్యకర్తలపై కొందరి రాళ్ల దాడికి సంబంధించిన వీడియో కూడా చర్చనీయాంశంగా మారింది. తెరాస కార్యకర్తలతో వెళ్తున్న ట్రాక్టర్ పైన కొందరు రాళ్ల దాడి చేశారు. ఇది కాంగ్రెస్ నేతలదిగా భావిస్తున్నారు. ఈ రాళ్ల దాడి రేవంత్ ఇంటికి సమీపంలో జరిగిందట.