ఆ లెటర్ ప్యాడ్ నాదే, కానీ..: కీసర తహసీల్దార్ ఏసీబీ కేసుపై రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్: ఇటీవల కీసర తహసీల్దార్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వినిపించాయి.
నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే..
ఈ నేపథ్యంలో శుక్రవారం రేవంత్ రెడ్డి స్పందించారు. కీసర తహసీల్దార్ ఏసీబీకి చిక్కిన వ్యవహారంలో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
నా లెటర్ హెడ్స్ ఉంటే తప్పేంటి?: రేవంత్
కాగా, కీసర తహసీల్దార్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు ఆయన తెలిపారు. తన లెటర్ హెడ్స్ లభించడంలో తప్పేముందన్న రేవంత్ రెడ్డి.. అందులో ఉన్న సమాచారానికి కీసర వ్యవహారానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధమున్నా శిక్షకు సిద్ధమని రేవంత్ తేల్చిచెప్పారు.
తహసీల్దార్ కస్టడీ కోరిన ఏసీబీ
ఏసీబీ కోర్టులో కీసర తహసీల్దార్ నాగరాజు కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి.సోమవారం కస్టడీ పిటిషన్పై ఏసీపీ కోర్టు తీర్పు ప్రకటించనుంది. నలుగురు నిందితులను నాలుగు రోజులపాటు కస్టడీకి ఏసీబీ కోరింది. లంచంగా తీసుకున్న రూ. 1.10 కోట్ల నగదుపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఓ భూ వివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేసి.. రూ. 1.10 కోట్లు తీసుకుంటున్న సమయంలో తహసీల్దార్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. తహసీల్దార్కు లంచం ఇచ్చిన ఇద్దరు రియల్ ఎస్టేట్ డెవలపర్లను కూడా ఆరెస్ట్ చేశారు. నాగరాజుకు ముందు నుంచి కూడా అవినీతి చరిత్ర ఉందని అధికారులు చెబుతున్నారు.