అడక్కుండా శంషాబాద్ జిల్లా వెనుక, ఆయన కోసమే: కేసీఆర్పై రేవంత్ సంచలనం
హైదరాబాద్: కొత్త జిల్లాల అంశం తెలంగాణలో వేడి రాజేస్తోంది. ఆదివారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వర రావుకు లబ్ధి చేకూర్చేందుకే శంషాబాద్ను జిల్లా చేశారని తీవ్ర విమర్శ చేశారు.
రాష్ట్రంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. జిల్లాల విభజనను లోపభూయిష్టంగా చేస్తున్నారన్నారు. హడావుడిగా జిల్లాల విభజన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు.
ఎవరూ డిమాండ్ చేయని శంషాబాద్ జిల్లాను చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎవరి కోసం దీనిని జిల్లాగా ప్రకటించారో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పాలన్నారు. రామేశ్వర రావుకు లబ్ది చేకూర్చేందుకే శంషాబాద్ను జిల్లా చేశారన్నారు.
ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారన్నారు. జిల్లాల విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉందని రేవంత్ విమర్శించారు. జిల్లాల విభజన ముసాయిదా లోపభూయిష్టంగా ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లాల విభజన చేయడంలేదన్నారు. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్, హన్మకొండను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన.. తాగుబోతు పాలనలా ఉందన్నారు.
కాగా, హన్మకొండను జిల్లాగా చేయాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. అదే సమయంలో జనగామను జిల్లాగా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హన్మకొండను జిల్లాగా చేయడంపై జిల్లాలో మండిపడుతున్నారు.
చారిత్రక నగరమైన వరంగల్ నుంచి హన్మకొండను విడదీయవద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే జనగామను జిల్లాగా చేసుకోవచ్చునని చెబుతున్నారు. అడిగిన వారికి జిల్లా ఇవ్వకుండా, తాము వద్దంటే ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.