అల్లుడు కాకముందే నా కూతురు ఐటీ చెల్లిస్తోంది: రేవంత్ మామ, ఓటుకు నోటుపై...
హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, అతని బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు, రాజకీయాల్లోకి రాకముందే తనకు ఆస్తులు ఉన్నాయని, తనకు పిల్లనిచ్చిన మామ కూడా కోటీశ్వరుడు అని రేవంత్ వెల్లడించారు. 2001 నుంచి కేసీఆర్ ఆస్తులు, 2007 నుంచి తన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ చేశారు. తాజాగా, ఐటీ సోదాలపై రేవంత్ మామ పద్మనాభ రెడ్డి స్పందించారు.
బాల్క సుమన్ వర్సిటీలో ఫ్రీ భోజనం తిని: రేవంత్, అదంతా ఎత్తుకెళ్లారని.. ఐటీ దాడులపై రివర్స్!
రేవంత్ నాకు అల్లుడు కాకముందే కూతురు గీత ఐటీ చెల్లింపు
రేవంత్ రెడ్డి తనకు అల్లుడు కాకముందు నుంచే తన కూతురు గీత పేరు మీద ఆదాయపన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో ఉన్న ఇళ్లు తన కూతురు గీతవేనని ఆయన చెప్పారు. తన అల్లుడు రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగితే అన్ని వివరాలు వెల్లడించానని చెప్పారు.
ఓటుకు నోటు గురించి తెలియదని చెప్పా
ఓటుకు నోటు కేసు గురించి అధికారులు అడిగారని, ఆ విషయం గురించి తనకు ఏదీ తెలియదని, అదే విషయం చెప్పానని అన్నారు. తనకు మళ్లీ కొన్ని ప్రశ్నలతో నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా వివరణ ఇవ్వమని చెప్పారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో కోర్టుకు సెబాస్టియన్
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ఏసీబీ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సిన్హా తదితరులు హాజరు కాలేదు. అనంతరం కేసు విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.
సమాధానం ఎవరు చెబుతారు?
మరోవైపు, ఐటీ కార్యాలయంలో ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్ సిన్హాను విచారించారు. ఐటీ అధికారుల ప్రశ్నలపై ఆయన సమయం కోరారు. 3వ తేదీ వరకు అధికారులు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్న చైతన్యపురిలో తన బంధువు రణదీర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని, అధికారులమని చెప్పి 15 మంది సోదాలు చేశారని, బంగారం, నగదు, సెల్ ఫోన్లు తీసుకెళ్లారని, దీనిపై ఐటీ అధికారులను అడిగితే తాము సోదాలు చేయలేదని చెప్పారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక ఐటీ అధికారులు వహిస్తారా చెప్పాలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు అన్నారు.