కేసీఆర్! నీ ప్రకటనతో మేం 40 స్థానాల్లో గెలుపు స్టార్ట్ చేశాం: గెలుపు ఈజీ అంటూ రేవంత్ రెడ్డి లెక్క
హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ సీఎం ఉంటారని తెరాస నేతలు వ్యాఖ్యానించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. తమది సీల్డ్ కవర్ సీఎం అయితే, మీ సీఎం చీప్ లిక్కర్ సీఎం అని ఎద్దేవా చేశారు.
Recommended Video
షాకింగ్: 'అంతర్యుద్ధం, టీఆర్ఎస్-కూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి'
కారు డ్రైవర్ను మార్చాలని మా బావ హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ను ఉద్దేశించి చెప్పారు. ఏ క్షణమైన టీఆర్ఎస్ కుండ పగిలే అవకాశముందని చెప్పారు. ఈసారి ప్రజలు కారు పార్టీకి బుద్ధి చెబుతారని, తమ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ 105 మందిని ప్రకటించినప్పుడే 40మందితో గెలుపు ప్రారంభం
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ 105 మందిని ప్రకటించిన రోజే కాంగ్రెస్ పార్టీ గెలుపు 40తో ప్రారంభమైందని చెప్పారు. టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థుల్లోని 40 స్థానాల్లో దేవుడు దిగి వచ్చినా ఆ పార్టీ నేతలను గెలిపించలేడని చెప్పారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని చెప్పారు.
అప్పుడే మా గెలుపు ఖాయమైంది
కేసీఆర్ ప్రకటనతో 40 మంది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని రేవంత్ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి మేజిక్ ఫిగర్ 60 అని చెప్పారు. అంటే ఇక తాము గెలవాల్సిన సీట్లు మరో 20 మాత్రమే అన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలు మరో ఇరవై స్థానాలకు మాత్రమే అన్నారు. కాబట్టి ఇది మాకు చాలా సులభమని చెప్పారు. కాబట్టి 105 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడే మా గెలుపు ఖాయమైందన్నారు.
40 నుంచి 60కి చేరుకోవడం సునాయాసం
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 40 నుంచే (గెలుపొందే స్థానాలు) ప్రారంభించిందని రేవంత్ చెప్పారు. ఆ నలభై నుంచి అరవైకి చేరుకోవడం సునాయసమని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ప్రజాకూటమిలోని మిగతా పక్షాలను గౌరవించి, వారికి కూడా సరైన ప్రాతినిథ్యం ఇచ్చి, వాళ్లందర్నీ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భాగస్వాములను చేస్తామని, అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు జరుగుతున్న ప్రక్రియ అన్నారు.
కూటమికి ఆశీర్వాదం
తమ కూటమికి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉందని రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన పార్టీగా కాంగ్రెస్ నెగ్గి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రజా కూటమి ప్రభుత్వమే రేపు తెలంగాణకు అండగా ఉంటుందని చెప్పారు.
పొత్తులు అర్థవంతంగా ఉండాలి
పొత్తులు అర్థవంతంగా ఉండాలని మరో కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తల మనోభావాలను కమిటీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. కూటమిలోని భాగస్వామ్యపక్షాలు పొత్తు విషయంలో సహకరించాలన్నారు.