టిడిపి వీడను కెసిఆర్ని వదలను, 25ఏళ్లు గెలుస్తా: రేవంత్, జగన్ కేసు వాయిదా
హైదరాబాద్: తాను ఎట్టి పరిస్థితుల్లోను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును వదిలే ప్రసక్తి లేదని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే, యువనేత రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు చెప్పారు.
ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి, ఇతర నిందితులు ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లు ఈ రోజు ఏసీబీ న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణలో భాగంగా వారు న్యాయస్థానానికి వచ్చారు.
ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ సమన్లను ఎసిబి అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ఏసిబి ఛార్జీషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయితే మరోసారి ఎసిబి ఎదుట రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశముంది. ఈ సందర్భంగా న్యాయస్థానం... సమన్లు వచ్చే వరకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది.
కోర్టుకు హాజరైన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గద్దె దిగే వరకు తాను తెలంగాణ సిఎం కెసిఆర్ పైన పోరాడుతానని చెప్పారు. ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఇరికించిందని ఆరోపించారు. చార్జీషీటు ఫైల్ చేశాక తన పైన కుట్రలు బయటపడతాయని చెప్పారు.
మరో ఇరవై అయిదేళ్ల పాటు తాను కొడంగల్ నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాం తీరు పైన హైకోర్టుకు వెళ్లనున్నట్లు రేవంత్ చెప్పారు. సదారం టిఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్నారు. సదారాం నియామకం చట్టవిరుద్ధమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతానని చెప్పారు.
జగన్ కేసు 24వ తేదీకి వాయిదా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఈడీ విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో విచారణకు జగన్, విజయసాయి రెడ్డిలు శుక్రవారం హాజరయ్యారు.