ఎన్ని కష్టాలైనా పడ్తా, టిడిపిని వీడను: రేవంత్, టిఆర్ఎస్లోకి టిడిపి మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్/నిజామాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్మూర్ పట్టణంలో గల తలారి సత్యం ఇంటికి ఆయన రానున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ శ్రేణులను కోరారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండవచ్చుగానీ, ఎల్లకాలం ఉండదని రేవంత్ రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. ఎన్నికష్టాలైనా పడతానే తప్ప, తాను పార్టీని వదిలే సమస్యే లేదని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డిలు టిడిపిని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు బాధను కలిగించిందన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో స్వార్థరాజకీయాల కోసం వారు పార్టీని వీడారన్నారు. స్వార్థపరులు వెళ్తే, బాధపడాల్సింది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని, కిందిస్థాయి నేతలు పైకెదిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
టిఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర రావు
మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో ఆయన సమావేశమయ్యారు. పోట్ల టీఆర్ఎస్లో చేరే విషయంపై చర్చించారు. మంత్రి స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలో వీరిద్దరూ భవిష్యత్ ప్రణాళికపై సమాలోచన చేశారు.
ఇక టీడీపీకి రాజీనామా చేసి ఈ నెల 15న టీఆర్ఎస్లో చేరనున్నట్లు పోట్ల నాగేశ్వరరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో నాగేశ్వర రావు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల చేపడుతున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.