రేవంత్ రెడ్డి పర్యటనలో అపశృతి... కారు దగ్ధం... కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో...
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి షాద్ నగర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత్ బంద్లో భాగంగా రేవంత్ స్థానిక వ్యవసాయ మార్కెట్లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు,రేవంత్ మద్దతుదారులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో బాణసంచా నిప్పు రవ్వలు ఓ కారుపై పడి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు భారీగా ఎగసిపడటంతో దీక్షా శిబిరం వద్ద ఉన్న కార్యకర్తలు పరుగులు పెట్టారు. వెంటనే ఫైరింజన్కు సమాచారం ఇచ్చినప్పటికీ... అప్పటికే కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం(డిసెంబర్ 8) భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్కు కాంగ్రెస్ సహా 18 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్లో భాగంగా విపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లను దిగ్బంధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్నిచోట్ల ఉదయం నుంచే బంద్ కొనసాగుతోంది.
మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొన్నారు. మరో మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద.. ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జిల్లాలోని టెక్రియాల్లో జరిగే నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ కొత్త చట్టాలు రైతులకు అన్ని విధాలా మేలు చేస్తాయని... వీటి ద్వారా వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ సాయంత్రం 7గంటలకు రైతులను చర్చలకు రావాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారికి కబురు పంపించారు. ఈ సమావేశంలోనైనా పురోగతి లభిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.