'ఆస్కార్'ను మించిన డ్రామా... అసలు నిజాలివి.. విద్యార్థులతో షర్మిల ముఖాముఖిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహకాల్లో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ అభిమానులు,యూనివర్సిటీ విద్యార్థులతో వైఎస్ షర్మిల ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే హైదరాబాద్లోని లోటస్పాండ్లో వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు,వారి ఆవేదనను విన్న షర్మిల... 'నేను నిలబడుతాను... మిమ్మల్ని నిలబెడుతాను...' అంటూ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ విద్యార్థి స్టేజీపై మాట్లాడుతూ ఉద్వేగానికి లోనుకావడంతో షర్మిల ఆ స్లోగన్ ఇచ్చారు. అయితే ఇదంతా వట్టి డ్రామా అంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.
ఆ వీడియో ప్లే చేసిన రేవంత్...
తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఇటీవల విద్యార్థులతో షర్మిల నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్పును రేవంత్ ప్లే చేశారు. అందులో ఓ యువకుడు 'నేనీ రోజు ఒకటే నమ్ముతున్నాను. లోటు బడ్జెట్లో ఆంధ్రానే జగనన్న అంత బాగా నడుపుతుంటే.. ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇంకెన్ని మంచి పథకాలు పెట్టవచ్చు.విద్యార్థులకు ఎంత చేయవచ్చు. కానీ చేయట్లేదు. కానీ నేను నమ్ముతున్నా అక్కా(షర్మిల) మీరు చేస్తారని...' అంటూ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు.
నెటిజన్ల ట్రోలింగ్...
'నాకు తండ్రి లేరు... నాకిప్పుడు తండ్రైనా,అక్కయినా మీరే అక్కా... మీరు వెనుకడుగు వేయొద్దు. మీరు ఉంటే చాలక్కా... ఒక్క మాట చెప్పండక్కా... నేనున్నాను అని చెప్పండక్కా...' అంటూ ఆ యువకుడు భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో అతన్ని ఓదార్చి మైక్ అందుకున్న షర్మిల... 'ఉన్నానమ్మా... నేను నిలబెడుతా... మిమ్మల్ని నిలబెడుతా...' అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ యువకుడిని చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అంతా డ్రామా : రేవంత్ రెడ్డి
ఇదే వీడియోపై తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆ యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు.అంతేకాదు, ఆ యువకుడు విద్యార్థి,నిరుద్యోగి రెండూ కాదన్నారు. హైదరాబాద్లోని కల్వరి టెంపుల్లో అతను ఆర్కెస్ట్రాలో పనిచేస్తుంటాడని తెలిపారు. ఇక అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా ముందే,చాలా ఏళ్ల క్రితమే చనిపోయారని చెప్పారు.
అంతేకాదు,అతని ఫేస్బుక్ ప్రొఫైల్లో హరీశ్ రావుతో దిగిన ఫోటోలు చూడవచ్చునని చెప్పారు. తెలంగాణ ప్రజలను అమాయకులను చూసి... వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. స్టేజీ మీద రక్తి కట్టించిన ఈ డ్రామాకు ఆస్కార్ తక్కువేనని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ సమాజం పట్ల ఇంత చిన్న చూపా అని ప్రశ్నించారు.