'చంద్రబాబు' పేరు: మంత్రి జూపల్లికి షాకిచ్చిన రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతిలో నుంచి తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి మైక్ లాక్కున్న సంఘటన గురువారం నాడు పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన ఏపీ ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అదే వేదిక పైన రేవంత్ రెడ్డి ఉన్నారు.
ఆయన జూపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలేదని చెబుతూ, ఆయన జూపల్లి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు: పొన్నం
విద్యుత్ పైన ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం మండిపడ్డారు. రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడుతోందన్నారు. పిరాయింపులకు పునరేకీకరణ పేరు పెట్టారని విమర్శలు గుప్పించారు. విద్యావంతుల వేదిక పుస్తకంపై కేసీఆర్ స్పందించాలన్నారు. విద్యా విధానంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నారు.