రెండు పెగ్గులేస్తే ఫ్రంట్, బ్యాక్ తెలియదు, థర్డ్ ఫ్రంట్ అవసరమా?: కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్
సిరిసిల్ల: రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్కి థర్డ్ ఫ్రంట్ అవసరమా? అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎద్దేవా చేశారు.
బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
థర్డ్ ఫ్రంట్ అవసరమా?
బుధవారం సిరిసిల్ల సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్కి థర్డ్ ఫ్రంట్ అవసరమా?' అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోరికలు తీర్చలేనోడు దేశంలోని ప్రజలందరి కోరికలు తీర్చగలడా? అని వ్యాఖ్యానించారు.
దేవుడ్ని చేయాలంటాడేమో...
తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏంటని.. సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడని, ఇప్పుడు కేంద్రం పెత్తనం ఏంటని తనను ప్రధానమంత్రిని చేయమంటున్నాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపు ప్రజల మీద దేవుడి పెత్తనం ఏంటని ఆయన్నే దేవుడ్ని చేయాలంటాడేమో అని ఎద్దేవా చేశారు.
పేదోళ్ల ప్రాణాలకు విలువ లేదా?
పేదోడి ప్రాణాలకు విలువ లేదా? అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పాలకులను నిలదీశారు. ‘నేరెళ్ల బాధితులు తగలబెట్టిన లారీలను మేం కొనిస్తాం.. మరి లారీల ప్రమాదంలో చనిపోయిన వారిని తిరిగి తీసుకొస్తారా?' అని ప్రశ్నించారు. పన్ను కట్టలేదని గౌడ సోదరులను ఎక్సైజ్ కార్యాలయంలో నిర్భందించారని, 4,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రైతును పరామర్శించిన పాపాన పోలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ కమీషన్ల చరిత్ర...
‘ఏదో ఉద్యమ నాయకుడి కొడుకు అని కేటీఆర్ను సిరిసిల్ల ప్రజలు గెలిపిస్తే.. ఆయన వారినెత్తినెక్కి నాట్యమాడుతున్నాడని, బతుకమ్మ చీరల పేరుతో రూ.150 కోట్ల కమీషన్ కొట్టేసిన చరిత్ర కేటీఆర్ది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక హరీశ్రావు నుంచి మైనింగ్ శాఖను గుంజుకుని కేటీఆర్కి కట్టబెట్టారని, మరి నా కథేందని సంతోష్రావు అడిగితే ఆయనకు ఇసుక రీచ్లు అప్పగించారని, ఇప్పుడేమో ఏకంగా రాజ్యసభకి పంపిస్తున్నారని దుయ్యబట్టారు.