మాధవ రెడ్డి బతికుంటే కేసీఆర్ దెయ్యం పట్టేది కాదు: రేవంత్, 'మోడీకి కేసీఆర్ ఒక్కరే చెప్పారు'
ఎలిమినేటి మాధవ రెడ్డి బతికుంటే కేసీఆర్ అనే దెయ్యం తెలంగాణకు పట్టేది కాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్/నల్గొండ: ఎలిమినేటి మాధవరెడ్డి లేని లోటు తీరనిదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం చిట్యాల మండలం వెలిమినెడులో మాధవరెడ్డి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నల్గొండ జిల్లా అభివృద్ధి సూచిక, ఆత్మగౌరవ పెద్దన్న మాధవ రెడ్డి అని కొనియాడారు. మాధవరెడ్డి బతికుంటే కేసీఆర్ అనే దెయ్యం తెలంగాణకు పట్టేది కాదన్నారు. ఫ్లోరైడ్కు విరుగుడుగా కృష్ణా జలాలు తెచ్చింది మాధవ రెడ్డి అని చెప్పారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లోరైడ్ బాధితులను ఎప్పుడైనా పరామర్శించారా? అని నిలదీశారు. డబుల్ బెడ్ రూం, రుణమాఫీ, మూడెకరాల భూమి హామీ ఏమైందో చెప్పాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
కేసీఆర్ ఒక్కరే నష్టాన్ని చెప్పారు: పల్లా
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుందని తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని సవివరంగా ప్రధాని మోడీకి తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మోడీని సీఎం కలిసిన తర్వాతే రైతులకు పెద్ద నోట్లతో విత్తనాలు కొనే అవకాశం లభించిందన్నారు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతల వద్దే నల్లధనం ఉందని విమర్శించారు. సామాన్య ప్రజల ఇబ్బందులు తొలగినపుడే కేంద్రం తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుందన్నారు.
రూ.2000 నోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బ్యాంకుల్లోకి రూ.500 నోట్లను పంపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్పై అవాకులుచవాకులు పేలితే సహించేదిలేదన్నారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారన్నారు.
కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్నారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారన్నారు. కేంద్రం ప్రజలకు భారీగా రూ.100, రూ.500 నోట్లను అందబాటులోకి తేవాలన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టాన్ని కేంద్రమే భరించాలన్నారు.