రాష్ట్రం ‘మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారని సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే కేసీఆర్ ఆలోచన నాలుగేళ్ల క్రితంనాటిదని అన్నారు.
గోల్డ్ స్టోన్ కంపెనీతో కలిసి..
గోల్డ్ స్టోన్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుని, ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని, వాటిని లాభాలు వచ్చే మార్గాల్లో నడుపుతారని రేవంత్ ఆరోపించారు. సాగు, తాగు నీరు ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించిన కంపెనీనే ఇప్పుడు చైనాకు చెందిన గోల్డ్ స్టోన్ కంపెనీకి దక్కించుకుందని అన్నారు.
‘మెఘా' పెట్టుబడులతో.. ‘మెఘా' ప్రణాళికలతో కేసీఆర్ ఆ కంపెనీ యజమాని ఒప్పించాడని, అందుకే కేసీఆర్ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
కేసీఆర్ రెండు ప్రణాళికలతో..
350 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసిన ఈ కాంట్రాక్ట్ ఎవరికి వెళుతుందని ప్రశ్నించారు. ఆ లాభం ఎవరి కోసమని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు రెండు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారని.. అందులో ఒకటి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం, రెండోది.. ఆర్టీసికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన భూముల్లో మల్లిఫ్లెక్సులు, పెట్రోలు బ్యాంకులు పెట్టుకునేందుకు తన బంధువులకు, చుట్టాలకు లీజుకు ఇవ్వడం అని రేవంత్ వ్యాఖ్యానించారు.
కరీంనగర్ చౌరస్తాలో ఆర్టీసీ స్థలంలో ప్రతిమ బిల్డింగ్ ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు.
పీపీపీ అంటూ కోట్లు కొల్లగొడుతున్నారు..
ఆర్టీసీకి చెందిన వేల కోట్ల విలువ చేసే భూములను పీపీపీపీ మోడల్లో కేసీఆర్ తన బంధువులకు కట్టబెడుతున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ భూములను ఎవరెవరికి లీజులకిచ్చారో వివరాలు బయటపెట్టాలని, అప్పుడే ప్రజలకు వేలకోట్ల భూములను ఎవరు కొల్లగొట్టారనే విషయం తెలుస్తుందని అన్నారు.
కేసీఆర్.. నిన్ను అండమాన్ జైలుకు పంపాలా?
సమ్మెను అడ్డం పెట్టుకుని ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తావా? అంటూ కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చట్ట బద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. ప్రజలు ఎన్నుకున్న మీరు సచివాలయానికి రానందుకు మీపై పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైలుకు తరలించాలని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ‘మెఘా'వృతం
ఆర్టీసీని 50శాతం ప్రైవేటీకరణ చేసి సంస్థలోని 25వేల మందిని తొలగిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు సమ్మె పేరుతో మొత్తం మంది ఉద్యోగులను తొలగించే కుట్ర పన్నారని కేసీఆర్పై మండిపడ్డారు. ఈస్డిండియా కంపెనీలో ఇప్పుడు ఓ ‘మెఘా' కంపెనీ రాష్ట్రాన్ని కబళించేందుకు సిద్ధమైందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రం ‘మెఘా'వృతం అవుతోందని అన్నారు.
కేసీఆర్.. నీ జాగీరా?
అధికారికంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాలకు కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తోందని అన్నారు. ఆర్టీసీ సంస్థ కేసీఆర్ జాగీరు కాదని.. ఆర్టీసీ కార్మికులు అంటే.. కేసీఆర్ ఫాంహౌస్లో పనిచేసేవాళ్లు కాదని అన్నారు. ప్రధాని మోడీని, అమిత్ షాను, రాజ్నాథ్ను కలిసి కేసుల విచారణ ఆపుకోవడం తెలుసు గానీ.. సమ్మె చేయాలనుకున్న కార్మికులతో చర్చలు జరిపేంత తీరిక లేదా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు.