దాన్నే నమ్ముకున్న రేవంత్: గులాబీ వ్యూహం సిద్దం?, కొడంగల్లో ఏం జరుగుతోంది?
వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల లాగా, చంద్రబాబుకు కుప్పం లాగా తనకు కొడంగల్ నిలిచిపోతుందని చెప్పుకొస్తున్నారు.
కొడంగల్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. దాన్ని నేరుగా స్పీకర్కు పంపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి. తద్వారా ఆయన సేఫ్ గేమ్ ఆడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏంటిదంతా?: రేవంత్ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?
పేరుకు రాజీనామా చేశానన్న పేరు.. ప్రజాప్రతినిధి గాను కొనసాగవచ్చన్న వ్యూహంతోనే రేవంత్ తన లేఖను చంద్రబాబుకు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం నుంచి రేవంత్కు గట్టి సవాల్ ఎదురవుతోంది. దమ్ముంటే రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కు పంపించాలని వారు సవాల్ చేస్తున్నారు.
రమణ పేల్చిన బాంబు:
రేవంత్ రాజీనామాపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలతో దీనిపై వాడి వేడి చర్చ జరుగుతోంది. రేవంత్ ఇప్పటివరకు అసలు రాజీనామానే చేయలేదంటూ ఆయన బాంబు పేల్చారు. దీంతో అధికార పార్టీ నుంచి రేవంత్ ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఇవన్నీ రేవంత్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తుండటంతో ఏం చేయాలనే సందిగ్ధంలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
గులాబీ వ్యూహం:
టీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా కేసీఆర్ను ఢీకొట్టేందుకు రేవంత్ తొలి నుంచి తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కు మారితే తన బలం మరింత పెరుగుతుందని భావించాడు. కానీ కాంగ్రెస్ రూపంలోనే రేవంత్కు చెక్ పెట్టాలని అటు అధికార పార్టీ భావిస్తుండటం గమనార్హం. ఇప్పటికే పలువురు, కాంగ్రెస్, టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్.. అవసరమైతే కాంగ్రెస్ నేతను పార్టీ తరుపున ఉపఎన్నికల బరిలో దించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
అదే జరిగితే:
అధికార పార్టీ ఎత్తుగడలు రేవంత్ ను ఇరుకుపెట్టేవిగా మారడంతో.. ఉన్నపలంగా నియోజకవర్గంలో పర్యటించాల్సిన పరిస్థితి తలెత్తింది. లేదంటే ఉన్న నేతలు కూడా టీఆర్ఎస్ లోకి జారుకునే పరిస్థితి. అయితే రేవంత్ కుటుంబంలో ఉన్న కొన్ని శుభకార్యాల రీత్యా.. కొన్ని రోజుల వరకు ఆయన ఇంటికే పరిమితమవుతారన్న వాదన కూడా ఉంది. ఈలోగా టీఆర్ఎస్ తన వ్యూహాలకు మరింత పదునుపెడితే రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం.
సెంటిమెంటును నమ్ముకున్న రేవంత్:
రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఉపఎన్నిక బరిలో దింపి మట్టికరిపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఉపఎన్నికలో బరిలో దిగడం గురించి రేవంత్ కూడా పునరాలోచనలో పడ్డాడా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఉపఎన్నిక బరిలో దిగితే మాత్రం కచ్చితంగా సెంటిమెంటును రగల్చాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంతరవరకు కొడంగల్ అంటే ఎవరికీ తెలియదని, తానొచ్చాకే నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా మారుమోగుతుందని పదేపదే రేవంత్ చెప్పుకుంటున్నారు. తన చివరి శ్వాస వరకు కొడంగల్ ప్రజల సేవలోనే తరిస్తానని భరోసా ఇస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల లాగా, చంద్రబాబుకు కుప్పం లాగా తనకు కొడంగల్ నిలిచిపోతుందని చెప్పుకొస్తున్నారు. ఉపఎన్నిక నాటికి ఈ సెంటిమెంటును మరింత రగిల్చి విజయం సాధించాలనే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు.