కేటీఆర్! మీకు బాధ్యత లేదా?: ‘గులాబీ కూలీ’పై రేవంత్ ఫిర్యాదు
మంత్రి కేటీ రామారావుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేరెళ్ల ఘటన జరిగి 40రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి బాధితులను పరామర్శించారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్: మంత్రి కేటీ రామారావుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేరెళ్ల ఘటన జరిగి 40రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి బాధితులను పరామర్శించారని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు స్పందించకుండా.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.
ఇసుక అక్రమంగా తరలిస్తూ.. దోపిడీ చేస్తుంటే దాన్ని ఇసుక మాఫియా అనకుండా మరేమంటారని ప్రశ్నించారు. మైనింగ్ మంత్రిగా ఉన్న కేటీఆర్కు ఇసుక మాఫియాను కట్టి చేయాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. విదేశాల్లో చేస్తున్న వ్యాపారాలకు అడ్డు తగిలారనే నేరెళ్లలోని దళితులను చితకబాదారని రేవంత్ ఆరోపించారు.
గులాబీ కూలీపై ఫిర్యాదు
గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు అవినీతికి పాల్పడ్డారని రేవంత్రెడ్డి.. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు. గులాబీ కూలీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డబ్బులు వసూలు చేసిన వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదులో కోరారు. బహిరంగ వసూళ్లకు సంబంధించిన పలు సాక్ష్యాధారాలను సమర్పించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం గులాబీ కూలీ పేరిట శ్రమదానం చేస్తున్నట్టు నటించి నిధులు సమీకరించారని తెలిపారు. కూలీ పేరిట కోట్ల రూపాయలు వసూలు చేయడం అవినీతిమాత్రమే కాకుండా శిక్షార్హమైన నేరమని, వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.