'మందబలంతో నెగ్గలేరు.. కేటీఆర్-హరీశ్ సమస్యలను తోసేసుకుంటున్నారు'
కేటీఆర్-హరీశ్ రావు బావబావమరుదులు ఒకరిపై ఒకరు సమస్యలను తీసేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెన్షన్ వేటుపడ్డ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడింట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా కత్తిపోటీలు, మల్లయుద్దాలు వంటివి చోటు చేసుకుంటాయేమోనని మంత్రి హరీశ్ రావు భావిస్తున్నారని, అందుకే తమను సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు.
మందబలం ఉన్నంత మాత్రానా అసెంబ్లీలో నెగ్గుకు రాలేరని, సీఎం ప్రవేశపెట్టిన షార్ట్ డిస్కషన్స్ లో లోపాలను ఎత్తిచూపిస్తే.. ఇంతవరకు సీఎం నుంచి సమాధానం రాలేదని మండిపడ్డారు.
ఇక సినీ నటుడు నాగార్జున చెరువు కబ్జా వ్యవహారాన్ని లేవనెత్తితే.. కేటీఆర్-హరీశ్ రావు బావబావమరుదులు ఒకరిపై ఒకరు సమస్యలను తీసేసుకుంటున్నారని ఆరోపించారు. చెరువు కబ్జా వ్యవహారాన్ని కేటీఆర్ పైకి తోసేసి హరీశ్ రావు తప్పించుకున్నారని విమర్శించారు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు గానీ వాటిని ప్రజల మీదకు నెట్టివేయవద్దని హితవు పలికారు.
ఆమధ్య కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసినప్పుడు.. కేటీఆర్-హరీశ్ ల పంచాయితీకి వెళ్లి వస్తున్నామని చెప్పినట్టుగా రేవంత్ పేర్కొన్నారు. విషయమేంటని ఆరా తీస్తే.. నా శాఖ పరిధిలోకి రానప్పటికీ, నాగార్జున చెరువు కబ్జా విషయాన్ని నామీదకు ఎందుకు తోసేశావంటూ హరీశ్ ను కేటీఆర్ ప్రశ్నించారని వారు తనతో చెప్పినట్టుగా రేవంత్ తెలిపారు.