నీ స్థాయేంటి? మద్దతిస్తానంటే రాహుల్ వద్దకు తీసుకెళ్తా: పవన్ కళ్యాణ్పై రేవంత్
హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు గురువారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Recommended Video
బీజేపీ-వైసీపీ పొత్తుపై విజయసాయి రెడ్డి కొత్త ట్విస్ట్, 'రూ.200 కోట్లతో బాబు విదేశీ టూర్'
ఆ తర్వాత రేవంత్ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఇదంతా ఓట్ల కోసం ప్రతిపక్ష ఓట్లను చీల్చే కుట్ర అని మండిపడ్డారు.
పవన్ను రాహుల్ వద్దకు తీసుకు వెళ్తా
తమ పార్టీ నేత వి హనుమంత రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని పవన్ నేరుగా తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెప్పాలన్నారు. ఇందుకోసం తాను పవన్ను రాహుల్ వద్దకు తీసుకు వెళ్తానని చెప్పారు.
పవన్ తన స్థాయికి తగినట్లు మాట్లాడటం లేదు
పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై పవన్ పదేపదే ప్రశంసలు కురిపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యూహంలో పవన్ పావు కావొద్దని హితవు పలికారు.
కల్వకుంట్ల రాజ్యాంగం
అంతకుముందు, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు గవర్నర్ను కలిశారు. అనంతరం రేవంత్, షబ్బీర్ అలీలు మాట్లాడారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తోందన్నారు. పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన వారి శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ప్రతిపక్షాలే కాదు న్యాయస్థానాలు అన్నా కూడా తెరాసకు గౌరవం లేదన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా
గవర్నర్కు ఫిర్యాదు చేశామని, రాష్ట్రపతి, ఈసీకి ఫిర్యాదు చేస్తామని రేవంత్, షబ్బీర్ అలీ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై గవర్నర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులను నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో కొనసాగించారన్నారు.
నిబంధనల ప్రకారం ఇలా
నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేను శాతానికి లోబడి కేబినెట్ మంత్రులు ఉండాలన్నారు. కానీ తెరాస ప్రభుత్వంలో అలా ఉండటం లేదన్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఇలాంటి నియామకాలు చెల్లవని సుప్రీం ఇటీవలే తేల్చిందన్నారు. ఏఏపీ మాదిరిగా ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పదవులకు అనర్హులు అన్నారు.