కేటీఆర్ మామపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు, ‘కేసీఆర్ హఠావో..’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజున గాంధీభవన్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
బావమరిది కళ్లల్లో ఆనందం: కేటీఆర్పై రేవంత్ సంచలనం, పరిటాలపైనా..
గాంధీభవన్లో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, తదితర నేతలు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ నుంచి విముక్తి..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధేనని అన్నారు. తెలంగాణ ఇప్పుడు నలుగురు కుటుంబసభ్యుల చేతిలోనే ఉండిపోయిందని అన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని రేవంత్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ను అడుగు కేటీఆర్
కేసీఆర్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరుగుతోందని, ఇది తుది దశ ఉద్యమమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో.. తనకు ఇష్టమైన టీడీపీని, కాంగ్రెస్, బీజేపీలను లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ అంటున్నారని.. ఆ విషయం నీ తండ్రి కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందని సూచించారు.
కేటీఆర్ సెల్ఫీలు.. కేసీఆర్ సెల్ఫ్ డబ్బాలు
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని రేవంత్ అన్నారు. నాగార్జున సాగర్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు కాంగ్రెస్ పార్టీని నిర్మించిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే.. ఇప్పుడు కేటీఆర్ ఐటీ కంపెనీల ముందు సెల్ఫీలు దిగుతున్నారని, కేసీఆర్ సెల్ఫ్ డబ్బా కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ మామపై సంచలన ఆరోపణలు
అంతేగాక, మీడియాకు ధైర్యం ఉంటే చూపించాలంటూ.. పలు కీలక ఆరోపణలు చేశారు రేవంత్. కేటీఆర్ సతీమణి శైలిమ తనకు సీతక్కతో సమానమని చెప్పుకుంటూ.. ఆమె తండ్రి గురించి ఆరోపణలు చేశారు. కేటీఆర్ మామ హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్తో ప్రభుత్వ ఉద్యోగం పొందాడని, ఇప్పుడు రిటైరై రూ.40వేల వరకు పెన్షన్ కూడా తీసుకుంటున్నాడని రేవంత్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన హరినాథరావును అరెస్ట్ చేసి, జైల్లో పెట్టిస్తావా? అంటూ కేటీఆర్ను నిలదీశారు రేవంత్.
కేసీఆర్ హఠావో..
కేసీఆర్ అబద్ధపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చినప్పటికీ కేసీఆర్ కృతజ్ఞత లేదని, అతడు కృతఘ్నుడని అన్నారు. ప్రజలకు మాత్రం కృతజ్ఞత ఉందని చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు శాపంగా తయారయ్యారని అన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అని జైపాల్ నినాదం చేశారు. ఇది నాంది ప్రస్తావన అని, తెలంగాణతోపాటు ఎర్రకోటపైనా జెండా ఎగరేస్తామని జైపాల్ అన్నారు.
మూర్ఖుడిలా తయారయ్యారు..
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అప్పుడు దేవత అన్న కేసీఆర్.. ఇప్పుడు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపని మూర్ఖుడిలా తయారయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యువతకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని మండిపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హామీలకే పరిమితమయ్యారని ఆరోపించారు.